తిరుపతి జిల్లాలో ఘోర ప్రమాదం.. ఆగి ఉన్న లారీని ఢీకొన్న అంబులెన్స్.. నలుగురు మృతి
తిరుపతి జిల్లాలో ఘోర ప్రమాదం.. ఆగి ఉన్న లారీని ఢీకొన్న అంబులెన్స్.. నలుగురు మృతి
రోడ్డు ప్రమాదం


తిరుపతి , 04 మే (హి.స.)

తిరుపతి జిల్లాలో ఈరోజు (సోమవారం) తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నాయుడుపేట - రేణిగుంట జాతీయ రహదారిపై శ్రీకాళహస్తి మండలం ఊరందూరు వద్ద ఆగి ఉన్న లారీని అంబులెన్స్ వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో అంబులెన్స్లో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. సమాచారం అందగానే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కోల్కతా నుంచి ఒక రోగిని మెరుగైన చికిత్స నిమిత్తం బెంగళూరులోని ఓ ఆస్పత్రికి అంబులెన్స్లో తరలిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. జాతీయ రహదారిపై అప్పటికే నిలిపి ఉంచిన లారీని అంబులెన్స్ వెనుక నుంచి వచ్చి బలంగా ఢీకొట్టింది. ఢీకొన్న వేగానికి అంబులెన్స్ ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జయ్యింది. ఈ ప్రమాదంలో అంబులెన్స్లో ఉన్న రోగితో పాటు ఆయనకు సహాయకులుగా ఉన్న మరో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మృతులంతా పశ్చిమ బెంగాల్కు చెందిన వారని ప్రాథమిక సమాచారం. వీరి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. డ్రైవర్ నిద్రమత్తు వల్లే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు చెబుతున్నారు.

అంబులెన్స్ డ్రైవర్ తీవ్ర గాయాలతో ప్రాణాపాయ స్థితిలో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, పోలీసులు స్పందించి డ్రైవర్ను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

---------------

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande