పెట్రో ధరల తగ్గింపుపై ఆశలు.. ఇప్పుడే కుదరదంటున్న కేంద్రం!
పెట్రో ధరల తగ్గింపుపై ఆశలు.. ఇప్పుడే కుదరదంటున్న కేంద్రం!
Petrol increased by 87 paise and diesel by 91 paise


హైదరాబాద్, 18 జూన్ (హి.స.)

అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు తగ్గినంత మాత్రాన దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు వెంటనే తగ్గవని కేంద్ర పెట్రోలియం, సహజవాయు శాఖ సహాయ మంత్రి సురేశ్ గోపీ స్పష్టం చేశారు. ఇంధన ధరల నిర్ణయంలో ముడిచమురు ధరలతో పాటు రవాణా, సరఫరా, మార్కెట్ పరిస్థితుల వంటి అంశాలు ప్రభావం చూపుతాయని తెలిపారు.

తక్కువ ధరకు కొనుగోలు చేసిన ముడిచమురు భారత్కు చేరేందుకు సమయం పడుతుందని సురేశ్ గోపీ చెప్పారు. ముఖ్యంగా హర్మూజ్ జలసంధి మార్గంలో నౌకల రద్దీ ఎక్కువగా ఉండటంతో సరఫరా ప్రక్రియ సాధారణ స్థితికి రావాల్సి ఉంటుందని పేర్కొన్నారు. అందువల్ల అంతర్జాతీయ ధరలు తగ్గిన వెంటనే దేశీయ ఇంధన ధరలను తగ్గించడం సాధ్యం కాదన్నారు.

పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా ఇటీవల గ్లోబల్ ఇంధన మార్కెట్లలో తీవ్ర ఒడుదొడుకులు చోటుచేసుకున్నాయని మంత్రి తెలిపారు. ముడిచమురు ధరల పెరుగుదల ప్రభావం పూర్తిగా వినియోగదారులపై పడకుండా కేంద్ర ప్రభుత్వం గణనీయమైన భారం భరించిందన్నారు. ఈ ప్రక్రియలో ప్రభుత్వానికి రూ.12 వేల కోట్ల మేర నష్టం వాటిల్లిందని చెప్పారు.

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గే దిశగా దౌత్యపరమైన ప్రయత్నాలు ముందుకు సాగడంతో అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు తగ్గుముఖం పట్టాయి. బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్కు 78 డాలర్లకు చేరగా డబ్ల్యూటీఐ క్రూడ్ ధర 75 డాలర్ల స్థాయికి దిగివచ్చింది. అయితే ఈ తగ్గుదల ప్రభావం దేశీయ ఇంధన ధరలపై కనిపించాలంటే మరికొంత సమయం పట్టే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande