
టెహ్రాన్ , 24 జూన్ (హి.స.)ఇరాన్లో భద్రతా పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని భారత ప్రభుత్వం మరోసారి కీలక ట్రావెల్ అడ్వైజరీ జారీ చేసింది. టెహ్రాన్లోని భారత రాయబార కార్యాలయం విడుదల చేసిన తాజా సూచనల ప్రకారం, తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు భారత పౌరులు ఇరాన్కు అనవసర ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని సూచించింది. ఇటీవల పరిస్థితులు కొంత మెరుగుపడినప్పటికీ, పూర్తిస్థాయిలో సాధారణ స్థితి నెలకొనలేదని రాయబార కార్యాలయం పేర్కొంది.
రాయబార కార్యాలయం ప్రకారం, అవసరం లేకపోతే ప్రస్తుతం ఇరాన్కు ప్రయాణించకపోవడమే మంచిదని సూచించింది. ప్రాంతీయ భద్రతా పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని, పరిస్థితులకు అనుగుణంగా తదుపరి సూచనలు జారీ చేస్తామని వెల్లడించింది.
ప్రస్తుతం ఇరాన్లో నివసిస్తున్న లేదా అక్కడికి అత్యవసరంగా వెళ్లాల్సిన భారతీయులు అప్రమత్తంగా ఉండాలి. స్థానిక అధికారుల సూచనలను పాటించాలి. తాజా భద్రతా సమాచారం కోసం అధికారిక ప్రకటనలను గమనించాలి. భారత రాయబార కార్యాలయంతో నిరంతర టచ్ లో ఉండాలి అని సూచించింది.
రాయబార కార్యాలయంలో నమోదు తప్పనిసరి
ఇరాన్లో ఉన్న భారత పౌరులు, అలాగే త్వరలో అక్కడికి వెళ్లే వారు తమ వివరాలను టెహ్రాన్లోని భారత రాయబార కార్యాలయంలో నమోదు చేసుకోవాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో సహాయం అందించడానికి ఈ నమోదు ఉపయోగపడుతుందని పేర్కొన్నారు
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు