
న్యూఢిల్లీ, 08 జూన్ (హి.స.)
కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ శనివారం (జూన్ 13, 2026) లోగా తన పదవికి రాజీనామా చేయకపోతే దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలు, నగరాల్లో పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు చేపడతామని 'కాక్రోచ్ జనతా పార్టీ' (CJP) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే ప్రకటించారు. నీట్-యూజీ (NEET-UG), సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు, సీయూఈటీ (CUET), ఎస్ఎస్సీ రిక్రూట్మెంట్ పరీక్షలలో జరిగిన అక్రమాలు, పేపర్ లీకేజీలు, వైఫల్యాలకు బాధ్యత వహిస్తూ మంత్రిని వెంటనే పదవి నుంచి తొలగించాలని లేదా ఆయనే స్వచ్ఛందంగా తప్పుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిర్వహించిన భారీ నిరసన ప్రదర్శన అనంతరం, సోషల్ మీడియా వేదికగా ఒక వీడియో ద్వారా దీప్కే ఈ వారం రోజుల గడువును ప్రకటించారు. దేశ రాజధానిలో జరిగిన ఈ ప్రారంభ ఆందోళనలో వేలాది మంది యువకులు, విద్యార్థులు బొద్దింకల మాస్కులు ధరించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ ఉద్యమానికి ప్రముఖ పర్యావరణ కార్యకర్త సోనమ్ వాంగ్చుక్తో పాటు వివిధ ప్రతిపక్ష పార్టీల రాజకీయ నాయకులు కూడా మద్దతు పలికారు. గడువు ముగిసేలోగా మంత్రి రాజీనామా చేయకుంటే ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని దీప్కే హెచ్చరించారు.
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi