అన్నామలై ఉద్యమానికి అనూహ్య స్పందన.. మూడు రోజుల్లోనే 17 లక్షల మంది!
అన్నామలై ఉద్యమానికి అనూహ్య స్పందన.. మూడు రోజుల్లోనే 17 లక్షల మంది!
ANNAMALAI POLITICAL ENTRY


చెన్నై, 09 జూన్ (హి.స.)

తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు కె. అన్నామలై ప్రారంభించిన వి ది లీడర్స్ (We The Leaders) ఉద్యమానికి ప్రజాక్షేత్రంలో అసాధారణ స్పందన లభిస్తోంది. జూన్ 5న ప్రారంభమైన ఈ ఉద్యమంలో కేవలం మూడు రోజుల వ్యవధిలోనే సుమారు 17 లక్షల మంది సభ్యులుగా చేరారని అన్నామలై ప్రకటించారు. ఈ భారీ సభ్యత్వ నమోదు ప్రస్తుతం తమిళనాడు రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

తమిళనాడులో సమూల రాజకీయ మార్పు తీసుకురావడమే లక్ష్యంగా ఈ ఉద్యమాన్ని చేపట్టినట్లు అన్నామలై తన సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. ప్రజల నుంచి వస్తున్న స్పందనను బట్టి వారు మార్పును ఎంత బలంగా ఆకాంక్షిస్తున్నారో స్పష్టమవుతోందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇది కేవలం ఆరంభం మాత్రమేనని, త్వరలోనే సమర్థులైన వారికి సంస్థాగత బాధ్యతలు అప్పగిస్తామని వెల్లడించారు. ప్రస్తుతానికి మొదటి నెల రోజుల పాటు కేవలం సభ్యత్వ నమోదు ప్రక్రియపైనే పూర్తిస్థాయిలో దృష్టి సారించనున్నట్లు స్పష్టం చేశారు.

సభ్యత్వ నమోదు కోసం కేవలం అధికారిక వెబ్సైట్ WeTheLeader.orgను మాత్రమే సంప్రదించాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తన పేరు, చిత్రాలను దుర్వినియోగం చేస్తూ అనధికారికంగా ఏర్పాటైన కొన్ని సంస్థలకు ఇప్పటికే లీగల్ నోటీసులు జారీ చేసినట్లు అన్నామలై వెల్లడించారు.

ఇటీవల బీజేపీకి రాజీనామా చేసిన అన్నామలై, వారసత్వ రాజకీయాలకు స్వస్తి పలికి, ప్రజా భాగస్వామ్యంతో కూడిన సుపరిపాలనే ధ్యేయంగా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. రానున్న రోజుల్లో ఇది పూర్తిస్థాయి రాజకీయ పార్టీగా రూపాంతరం చెందే అవకాశాలు ఉన్నాయని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ పరిణామాలు తమిళనాడు రాజకీయాలపై ఎలాంటి ప్రభావం చూపుతాయనే అంశంపై విశ్లేషకులు ఆసక్తి కనబరుస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande