
జమ్మూ-కశ్మీర్, 22 జూలై (హి.స.)
జమ్మూ-కశ్మీర్లో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా తీవ్ర నష్టం వాటిల్లుతోంది. కొండచరియలు, మట్టిచరియలు (Mudslides) విరిగిపడటంతో పాటు పైనుంచి రాళ్ళు జారిపడుతుండటంతో (Shooting stones) అత్యంత కీలకమైన జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారి (NH44)పై వాహనాల రాకపోకలను అధికారులు పూర్తిగా నిలిపివేశారు. భద్రతా కారణాల దృష్ట్యా కశ్మీర్లోని ఖాజీగుండ్ నుంచి, అలాగే ఉధంపూర్ వైపు నుంచి రాంబన్ వైపు వెళ్ళే వాహనాలను ఎక్కడికక్కడే నిలిపివేశారు.
డోడా జిల్లాలోని భలేసా ప్రాంతంలో కురిసిన భారీ వర్షాలకు నదులు, వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఆకస్మిక వరదలు (Flash floods), మేఘావృత వర్షాలు (Cloudbursts), కొండచరియలు విరిగిపడటంతో ఇళ్ళు, పంట పొలాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. పరిస్థితులు విషమించడంతో డోడా, కిష్ట్వార్ జిల్లాల పాలనా యంత్రాంగం ప్రజలను అప్రమత్తం చేసింది. వాతావరణం అనుకూలించే వరకు ఎత్తైన ప్రాంతాలు, కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉన్న చోట్లు, నదీ తీర ప్రాంతాలకు వెళ్లవద్దని హెచ్చరించింది.
అలాగే రాంబన్ పరిసర ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల వల్ల ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోయాయి. పర్వత ప్రాంతాలను దట్టమైన పొగమంచు కమ్మేయడంతో వాహనదారులకు దృశ్యమానత (Visibility) తగ్గి రాకపోకలకు తీవ్ర ఇబ్బందిగా మారింది.
మరోవైపు రియాసి ప్రాంతంలో వర్షాలు కురుస్తుండటంతో సలాల్ జలాశయానికి భారీగా ప్రవాహ నీరు చేరుతోంది. జలాశయ మట్టాన్ని నియంత్రించేందుకు అధికారులు సలాల్ డ్యామ్ గేట్లన్నింటినీ ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో చీనాబ్ నది ఉప్పొంగి వేగంగా ప్రవహిస్తోంది. చీనాబ్ నదీ పరివాహక ప్రాంత ప్రజలను, లోతట్టు ప్రాంతాల వాసులను అధికారులు అప్రమత్తం చేశారు. రాజౌరి జిల్లాలో కూడా మంగళవారం ఉదయం నుండి కురుస్తున్న వర్షాల వల్ల ఆకస్మిక వరదలు, నీరు నిలిచిపోయే ప్రమాదం ఉందంటూ పోలీసులు, జిల్లా యంత్రాంగం ప్రజలకు హెచ్చరికలు జారీ చేశాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi