
హైదరాబాద్, 25 జూలై (హి.స.)
నీట్ (NEET) పేపర్ లీక్ వివాదంపై నిరసనలు తెలుపుతున్న విద్యార్థులను ఉద్దేశించి కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ బెదిరింపు వ్యాఖ్యలు చేసినట్లుగా ఉన్న ఒక నకిలీ వీడియో సోషల్ మీడియాలో కలకలం రేపింది. అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాంకేతికతతో సృష్టించిన ఈ డీప్ఫేక్ వీడియోకు సంబంధించిన అనేక సోషల్ మీడియా లింకులను శనివారం (జూలై 25) ఐటీ శాఖ ఆధ్వర్యంలో తొలగించినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.పార్లమెంట్ వెలుపల తాను మీడియాతో మాట్లాడిన అసలు వ్యాఖ్యలను దురుద్దేశపూర్వకంగా ఏఐ (AI) ద్వారా మార్చేశారని (డాక్టరింగ్), తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసేందుకే ఈ కుట్రకు పాల్పడ్డారని మంత్రి పీయూష్ గోయల్ స్వయంగా స్పష్టం చేశారు. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు సాంకేతికతను ఇలా బాధ్యతారాహిత్యంగా దుర్వినియోగం చేయడాన్ని ఎంతమాత్రం సహించబోమని ఆయన హెచ్చరించారు. ఈ వ్యవహారంపై ఆయన ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఢిల్లీలోని చాణక్యపురి పోలీస్ స్టేషన్లో జూలై 25న తెల్లవారుజామున 4:35 గంటలకు ఎఫ్ఐఆర్ (FIR నెం. 123/26) నమోదైంది. ఈ నకిలీ వీడియోను సృష్టించిన, వ్యాప్తి చేసిన మరియు ఉద్దేశపూర్వకంగా ప్రమోట్ చేసిన ప్రతి ఒక్కరిపై కఠిన చట్టపరమైన చర్యలు ఉంటాయని మంత్రి 'X' (ట్విట్టర్) వేదికగా హెచ్చరించారు.మరోవైపు, ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో విద్యార్థులు సాగిస్తున్న నిరసనల నేపథ్యాన్ని ఆసరాగా చేసుకుని, సదరు నకిలీ వీడియోను పాకిస్థాన్కు చెందిన కొన్ని ప్రచార ఖాతాలు (Propaganda Accounts) సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేస్తున్నట్లు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) ఫ్యాక్ట్-చెక్ విభాగం కూడా శుక్రవారం సాయంత్రమే గుర్తించి ప్రజలను అప్రమత్తం చేసింది. ఇలాంటి అన్-వెరిఫైడ్ వీడియోలను నమ్మవద్దని, కేవలం అధికారిక వనరుల ద్వారా వచ్చే సమాచారాన్ని మాత్రమే విశ్వసించాలని అధికారులు కోరారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi