
హైదరాబాద్, 23 జూలై (హి.స.)
దేశంలో అత్యంత రద్దీగా ఉండే సరుకు రవాణా కారిడార్లలో రైలు రవాణా సామర్థ్యాన్ని పెంచే దిశగా భారతీయ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. సౌత్ ఈస్టర్న్ రైల్వే పరిధిలోని నింపురా వెస్ట్ ఔటర్ క్యాబిన్ నుండి మిడ్నాపూర్ మధ్య 14.52 కిలోమీటర్ల మేర మూడో రైల్వే లైన్ నిర్మాణానికి రూ. 440 కోట్ల అంచనా వ్యయంతో రైల్వే శాఖ అనుమతులు మంజూరు చేసింది. ప్రస్తుతం ఈ మార్గంలో లైన్ సామర్థ్యం వినియోగం 115.71 శాతానికి చేరి తీవ్రమైన రద్దీ (కంజెషన్) నెలకొనడంతో, ఈ అదనపు లైన్ నిర్మాణం ద్వారా రైళ్ల రాకపోకలకు లైన్ క్లియరెన్స్ సులువవుతుంది. పరిశ్రమలకు అవసరమైన ఇనుప ఖనిజం, బొగ్గు, సిమెంట్, పెట్రోలియం ఉత్పత్తులు మరియు ఆహార ధాన్యాల వంటి ముఖ్యమైన వస్తువుల వేగవంతమైన రవాణాకు ఈ ప్రాజెక్ట్ ఎంతో దోహదపడుతుంది. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే ఏటా అదనంగా 3.52 మిలియన్ టన్నుల సరుకు రవాణా సామర్థ్యం పెరుగుతుందని, తద్వారా పారిశ్రామిక వృద్ధికి మరియు నెట్వర్క్ విశ్వసనీయతకు మరింత బలం చేకూరుతుందని అధికారులు వెల్లడించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi