కోర్టు దృశ్యాలను ప్రసారం చేయడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం.. కీలక ఆదేశాలు జారీ
కోర్టు దృశ్యాలను ప్రసారం చేయడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం.. కీలక ఆదేశాలు జారీ
Supreme Court HD


హైదరాబాద్, 24 జూలై (హి.స.)

న్యాయస్థానాల లైవ్ స్ట్రీమింగ్ (ప్రత్యక్ష ప్రసారాల) వీడియోలను సోషల్ మీడియా మరియు ఇతర డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లలో దుర్వినియోగం చేయడంపై భారత అత్యున్నత న్యాయస్థానం (సుప్రీంకోర్టు) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సుప్రీంకోర్టు సెక్రటరీ జనరల్ లేదా ఆయా రాష్ట్రాల హైకోర్టుల రిజిస్ట్రార్ జనరల్స్ ముందస్తు అనుమతి లేకుండా కోర్టు విచారణలకు సంబంధించిన ఆడియో-విజువల్ రికార్డింగులను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం, రీపోస్ట్ చేయడం లేదా అప్‌లోడ్ చేయడాన్ని జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జాయ్‌మల్య బాగ్చీ, జస్టిస్ వి. మోహనాలతో కూడిన ధర్మాసనం పూర్తిగా నిషేధిస్తూ శుక్రవారం ఉత్వర్వులు జారీ చేసింది.

కోర్టులలో సుదీర్ఘంగా జరిగే విచారణల నుండి కేవలం కొన్ని వివాదాస్పద సంభాషణలను లేదా జడ్జీలు చేసే ప్రాథమిక వ్యాఖ్యలను మాత్రమే కత్తిరించి (క్లిప్పింగ్స్), వాటికి తప్పుడు శీర్షికలు, సంచలన కామెంట్లు జోడించి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారని పిటిషనర్ కోర్టు దృష్టికి తెచ్చారు. దీనివల్ల న్యాయమూర్తులు, న్యాయవాదులు తీవ్రమైన ట్రోలింగ్ మరియు వ్యక్తిత్వ హననానికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన జస్టిస్ బాగ్చీ.. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లు ఇలాంటి వీడియోలతో నిండిపోయాయని, సంచి నుండి బయటపడిన భూతాన్ని (డెమన్‌ను) మనం పూర్తిగా ఆపలేం అని వ్యాఖ్యానించారు. కోర్టు విచారణలు అనేవి 24 గంటలు వినోదాన్ని పంచే టీవీ ఛానళ్లు కావని ధర్మాసనం స్పష్టం చేసింది.

వైరల్ క్లిప్‌ల ద్వారా డబ్బులు సంపాదించే (మోనటైజేషన్) వాణిజ్య ప్రక్రియలపై కోర్టు తక్షణ నిషేధం విధించింది. అయితే ఈ తాత్కాలిక నిబంధనలు వార్తా పత్రికలు లేదా మీడియా సంస్థల సాధారణ కోర్టు రిపోర్టింగ్‌కు వర్తించవని కోర్టు స్పష్టం చేసింది. ఈ వ్యవహారంలో నియంత్రణ అవసరమని సాలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కూడా అంగీకరించగా, సోషల్ మీడియా సంస్థలను ఈ కేసులో భాగస్వాములను చేసేందుకు వారి జాబితాను సమర్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశిస్తూ నోటీసులు జారీ చేసింది

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande