కార్గిల్ విజయ్ దివస్: అమరవీరులకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఘన నివాళి
కార్గిల్ విజయ్ దివస్: అమరవీరులకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఘన నివాళి
kargil


ద్రాస్ (లడఖ్):, 26 జూలై (హి.స.)

కార్గిల్ విజయ్ దివస్ 27వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఇవాళ (ఆదివారం, 26 జూలై 2026) లడఖ్‌లోని ద్రాస్ కార్గిల్ యుద్ధ స్మారకం వద్ద భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అమరవీరులైన సైనికులకు పుష్పగుచ్ఛం ఉంచి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్గిల్ విజయం భారతావని కిరీటంలో నిలిచే ఒక అమూల్యమైన వజ్రం లాంటిదని కొనియాడారు. లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ వి.కె. సక్సేనా, ఆర్మీ చీఫ్ జనరల్ సేథ్, నార్తర్న్ కమాండ్ జనరల్ ఆఫీసర్ కమాండింగ్-ఇన్-చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ ప్రతీక్ శర్మ తదితర రక్షణ రంగ ఉన్నతాధికారులు కూడా ఈ నివాళులర్పించిన వారిలో ఉన్నారు.ఈ వేదికపై నుండి పాకిస్తాన్‌కు రక్షణ మంత్రి తీవ్ర హెచ్చరికలు జారీ చేస్తూ, ఇకపై పొరుగు దేశం చేసే ఎలాంటి దుశ్చర్యలకైనా వారి ఊహకు అందని రీతిలో భారత్ దీటుగా సమాధానం ఇస్తుందని స్పష్టం చేశారు. పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని తన ప్రభుత్వ విధానంగా మార్చుకుందని, అక్కడ సైన్యానికి, ఉగ్రవాదులకు మధ్య తేడా పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిందని ఆరోపించారు.

ఉగ్రవాద సంస్థలకు పాక్ ఆర్మీ రక్షణ కల్పించడమే కాకుండా వారితో కలిసి పనిచేస్తోందని, అందుకే గతేడాది మే 2025లో పహల్గామ్ ఉగ్రదాడికి వ్యతిరేకంగా భారత్ చేపట్టిన ‘ఆపరేషన్ సింధూర్’ ద్వారా ఉగ్రవాదులను, వారికి మద్దతిచ్చే ప్రభుత్వాలను భారత్ వేర్వేరుగా చూడబోదనే విషయాన్ని స్పష్టం చేశామని గుర్తుచేశారు.పాకిస్తాన్‌తో చర్చల అంశంపై రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ, భారత్ డేటా సెంటర్లను నిర్మిస్తుంటే పాకిస్తాన్ మాత్రం రాడికల్ సెంటర్లను తయారు చేస్తోందని ఎద్దేవా చేశారు. పాకిస్తాన్‌తో ఎలాంటి సాధారణ చర్చలు ఉండవని, ఒకవేళ భవిష్యత్తులో చర్చలు అంటూ జరిగితే అవి కేవలం పాక్ ఆక్రమిత కాశ్మీర్ (PoK) గురించే ఉంటాయని, ఎందుకంటే అది చట్టవిరుద్ధంగా ఆక్రమించబడిన భారత భూభాగమని తేల్చిచెప్పారు. శనివారం సాయంత్రం జరిగిన 'శౌర్య సంధ్యా' కార్యక్రమంలో పాల్గొన్న రక్షణ మంత్రి కార్గిల్ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన సైనికుల కుటుంబ సభ్యులకు పవిత్ర 'కలశాన్ని' అందజేశారు. 1999లో పాక్ చొరబాట్లకు వ్యతిరేకంగా భారత సైన్యం సాహసోపేతంగా చేపట్టిన 'ఆపరేషన్ విజయ్' ఘన విజయాన్ని స్మరించుకుంటూ ప్రతి ఏటా జూలై 26న దేశవ్యాప్తంగా కార్గిల్ విజయ్ దివస్ జరుపుకుంటారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande