
అమరావతి, 30 జూలై (హి.స.)
రాయలసీమను పునరుత్పాదక విద్యుత్ హబ్గా మార్చేందుకు మంత్రి లోకేశ్ చేస్తున్న కృషి సత్ఫలితాలనిస్తోంది. దీనిలో భాగంగా టాటా పవర్ రెన్యువబుల్ ఎనర్జీ లిమిటెడ్ (టీపీఆర్ఈఎల్) రూ. 5,350కోట్లతో అనంతపురం, కర్నూలు జిల్లాల్లో ఏర్పాటు చేయబోయే 800 మెగావాట్ల క్లీన్ ఎనర్జీ ప్రాజెక్టులకు గురువారం పత్తికొండలో లోకేశ్ శంకుస్థాపన చేస్తారు. టీపీఆర్ఈఎల్ రాష్ట్రంలో రెండు పెద్ద పునరుత్పాదక ప్రాజెక్టులను అభివృద్ధి చేయబోతోంది. వీటిలో అనంతపురం జిల్లా కనేకల్లులో 760 ఎకరాల్లో రూ.3,500కోట్లతో ఏర్పాటు చేసే 400 మెగావాట్ల పవనశక్తి ప్రాజెక్టు, కర్నూలు జిల్లా, పత్తికొండలో 2,700ఎకరాల్లో రూ. 2,250 కోట్లతో స్థాపించే 400 మెగావాట్ల సౌరశక్తి ప్రాజెక్టులు ఉన్నాయి. ఈ ప్రాజెక్టుల నిర్మాణ దశలో సుమారు 4 వేల మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయి. రాష్ట్రానికి పెద్దఎత్తున వస్తున్న భారీ పరిశ్రమల పునరుత్పాదక ఇంధన అవసరాలను తీర్చడమే లక్ష్యంగా వీటిని ఏర్పాటు చేస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ