
గుత్తి, 30 జూలై (హి.స.)అనంతపురం జిల్లా గుత్తి మండలంలోని 67వ జాతీయ రహదారిపై గురువారం తెల్లవారుజామున కారు దగ్ధం అయ్యింది. కారులో ఉన్న ఓ వ్యక్తి సజీవ దహనం అయ్యారు.
గుత్తి-తాడిపత్రి మార్గమధ్యంలోని టి.కొత్తపల్లి గ్రామ సమీపంలో 67వ జాతీయ రహదారిపై దారుణ ఘటన చోటుచేసుకుంది. ఏపీ09 సీఎమ్ 264 నంబర్ గల కారు మంటల్లో పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటనలో కారులో ఉన్న ఓ వ్యక్తి సజీవదహనమైనట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు.
సమాచారం అందుకున్న సీఐ ఎం.రామారావు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతుడి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఘటన స్థలంలో డీజిల్ క్యాన్లు కనిపించడంతో కారుపై ఎవరైనా డీజిల్ పోసి నిప్పంటించి ఉండవచ్చనే కోణంలో కూడా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే, అసలు ఘటన ఎలా జరిగింది, ప్రమాదమా లేదా ఇతర కారణాలున్నాయా అనే అంశాలపై అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మృతుడి గుర్తింపు, ఘటనకు గల ఖచ్చితమైన కారణాలు పోలీసుల విచారణ అనంతరం వెల్లడికానున్నాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV