బగ్లాముఖి ఆలయ విరాళాలలో భారీ అవకతవకలు.. దర్యాప్తునకు ఆదేశించిన అగర్ మాల్వా కలెక్టర్ ప్రీతి యాదవ్
బగ్లాముఖి ఆలయ విరాళాలలో భారీ అవకతవకలు.. దర్యాప్తునకు ఆదేశించిన అగర్ మాల్వా కలెక్టర్ ప్రీతి యాదవ్
bhagla


అగర్ మాల్వా (మధ్యప్రదేశ్), 08 జూలై (హి.స.)

:

మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ప్రముఖ ధార్మిక క్షేత్రమైన నల్ఖేడాలోని మా బగ్లాముఖి ఆలయ విరాళాల సేకరణలో తీవ్ర ఆర్థిక అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు రావడంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ఆలయానికి వచ్చే భక్తులు సమర్పించే నగదు, బంగారం, వెండి కానుకల లెక్కింపు, రశీదుల జారీలో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయనే ఫిర్యాదులపై అగర్ మాల్వా జిల్లా కలెక్టర్ ప్రీతి యాదవ్ తీవ్రంగా స్పందించారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి నివేదిక సమర్పించాల్సిందిగా ముగ్గురు ఉన్నతాధికారులతో కూడిన ప్రత్యేక సంయుక్త విచారణ కమిటీని ఏర్పాటు చేస్తూ ఆమె తక్షణ ఉత్తర్వులు జారీ చేశారు.

ప్రభుత్వ నిబంధనల ప్రకారం పురాతనమైన బగ్లాముఖి ఆలయ నిర్వహణ పూర్తిగా స్థానిక సబ్-డివిజనల్ మేజిస్ట్రేట్ (SDM) నేతృత్వంలోని ప్రభుత్వ కమిటీ పరిధిలో ఉంటుంది. నిబంధనల ప్రకారం ఎలాంటి ప్రైవేట్ వ్యక్తులు లేదా సంస్థలు ఇక్కడ విరాళాలు సేకరించడానికి వీల్లేదు. అయితే, గత కొంతకాలంగా ఒక ప్రైవేట్ స్వచ్ఛంద కమిటీ ఆలయ ప్రాంగణంలో అనధికారికంగా సమాంతర విరాళాల సేకరణ వ్యవస్థను నడుపుతున్నట్లు కలెక్టర్ కార్యాలయానికి ఆధారాలతో కూడిన ఫిర్యాదులు అందాయి. సదరు ప్రైవేట్ బృందం సొంతంగా నకిలీ రశీదు పుస్తకాలను ముద్రించి, భక్తుల నుండి పెద్ద ఎత్తున నగదుతో పాటు విలువైన బంగారు, వెండి ఆభరణాలను వసూలు చేసినట్లు ప్రాథమిక సమాచారంలో తేలింది.

ఈ విధంగా సేకరించిన విరాళాలను ప్రభుత్వ అధికారిక ఖజానాలో జమ చేయకుండా, ప్రైవేట్ బ్యాంక్ ఖాతాలకు మళ్లించారని ఆరోపణలు వచ్చాయి. గత రెండేళ్లుగా సదరు ప్రైవేట్ కమిటీ ఎలాంటి పారదర్శకత లేకుండా లక్షలాది రూపాయల విలువైన కానుకలను దారి మళ్లించిందని భక్తులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా పంచాయితీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) బి.ఎస్. సోలంకి నాయకత్వంలో, జిల్లా ట్రెజరీ ఆఫీసర్ మనీష్ సోలంకి, నల్ఖేడా మున్సిపల్ కౌన్సిల్ సీఎంఓ మిని అగర్వాల్ సభ్యులుగా ఉన్న విచారణ కమిటీ రంగంలోకి దిగింది.

ఈ ఉన్నతాధికారుల బృందం ఆలయ ప్రాంగణాన్ని క్షుణ్ణంగా పరిశీలించి, అనధికారిక రశీదు పుస్తకాలను, ప్రైవేట్ బ్యాంక్ ఖాతాల లావాదేవీలను నిశితంగా తనిఖీ చేయనుంది. ఈ అక్రమాలలో ఆలయ సిబ్బంది లేదా ఇతర ప్రభుత్వ అధికారుల పాత్ర ఏమైనా ఉందా అనే కోణంలో కూడా విచారణ జరగనుంది. సేకరించిన పూర్తి సాక్ష్యాధారాలు, సంబంధిత వ్యక్తుల వాంగ్మూలాలతో కూడిన తుది నివేదికను రాబోయే ఏడు రోజుల్లోగా కలెక్టర్‌కు సమర్పించాలని కమిటీని ఆదేశించారు. దేశవ్యాప్తంగా రాజకీయ నాయకులు, ప్రముఖులు శత్రు వినాశనం, న్యాయపరమైన చిక్కుల నుండి విముక్తి కోసం ఇక్కడ ప్రత్యేక పూజలు, మిర్చి హవనాలు నిర్వహిస్తుంటారు. అలాంటి అత్యంత ప్రతిష్టాత్మకమైన సిద్ధపీఠంలో ఇలాంటి ఆర్థిక అవకతవకలు బయటపడటం స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande