
న్యూఢిల్లీ, 09 జూలై (హి.స.)
దేశ రాజధాని అయిన ఢిల్లీ నగరంలో నిబంధనలకు విరుద్ధంగా భారీ ఎత్తున అక్రమ నిర్మాణాలు (Illegal structures) వెలుస్తున్నాయి. ఆ భవనాలలో కనీస అగ్నిమాపక భద్రత (ఫైర్ సేఫ్టీ) లోపాలు లేకపోవడంతో సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. భవనాలు కూలిపోయినా, అగ్ని ప్రమాదాలు జరిగినా కేవలం బిల్డర్లను మాత్రమే అరెస్టు చేసి, అక్రమ నిర్మాణాలను చూసీచూడనట్లు వదిలేసిన మున్సిపల్ అధికారులను ఎందుకు వదిలేస్తున్నారని న్యాయస్థానం నిలదీసింది. నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసిన కోర్టు.. ఆగస్టు 4 నాటికి తీసుకున్న చర్యల నివేదికతో మున్సిపల్ కమిషనర్లు, సీఈఓలు స్వయంగా కోర్టుకు హాజరు కావాలని సమన్లు జారీ చేసింది.
అక్రమ భవనాల భద్రతా ప్రమాణాలను క్షేత్రస్థాయిలో పక్కాగా పరిశీలించడానికి ఇద్దరు ఐఐటీ ఢిల్లీ సీనియర్ ప్రొఫెసర్లు, ఇద్దరు డ్రాఫ్ట్సమెన్లతో కూడిన ఒక ఉన్నత స్థాయి ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అదేవిధంగా, గురుగ్రామ్లో ఏకంగా 93 శాతం వ్యాపార సముదాయాలు, భవనాలలో ఫైర్ సేఫ్టీ లోపాలు ఉన్నాయని వచ్చిన కథనాన్ని సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించి విచారణ చేపట్టింది. ఈ భద్రతా లోపాలపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ.. గురుగ్రామ్ డెవలప్మెంట్ అథారిటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ హెడ్ స్వయంగా కోర్టుకు హాజరై భద్రతా చర్యలపై వివరణాత్మక నివేదిక ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..