
లక్నో, 09 జూలై (హి.స.)
:అయోధ్య రామాలయ విరాళాలలో జరిగినట్లు
చెప్తున్న అక్రమాలపై సమాజ్వాదీ పార్టీ (SP) అధినేత
అఖిలేష్ యాదవ్ గురువారం బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సనాతన
ధర్మంలో దైవ విరాళాలను దొంగిలించడం కంటే పెద్ద పాపం మరొకటి లేదని, ఇది ఒక మహాపరాధం అని ఆయన
అభివర్ణించారు. ఈ వ్యవహారంపై ఆలయ ట్రస్ట్ను పూర్తిగా పునర్వ్యవస్థీకరించాలని
డిమాండ్ చేశారు.
లక్నోలో
ఆధ్యాత్మిక గురువు స్వామి అవిముక్తేశ్వరానంద సరస్వతిని కలిసిన అనంతరం అఖిలేష్
యాదవ్ విలేకరులతో మాట్లాడారు. తమ స్వార్థ ప్రయోజనాల కోసం బీజేపీ నాయకులు
శ్రీరాముడి ప్రతిష్టను దిగజార్చారని, నకిలీ
విరాళాల కూపన్లు ముద్రించి మోసాలకు పాల్పడ్డారని ఆరోపించారు. ఈ కేసును
విచారిస్తున్న ప్రత్యేక విచారణ బృందం (SIT) కేవలం
ఒక కంటితుడుపు చర్య (లిపాపోతి) మాత్రమేనని కొట్టిపారేశారు. ఎస్ఐటీ సభ్యులలో
ఒకరిపైనే 420 చీటింగ్ కేసులు ఉన్నప్పుడు విచారణ ఎలా
నిష్పక్షపాతంగా సాగుతుందని ఆయన ప్రశ్నించారు.
ఈ
కుంభకోణంలో ఉన్నత స్థాయి బీజేపీ నేతల ప్రమేయం ఉందని అఖిలేష్ ఆరోపించారు. నిందితుల
కాల్ డేటా రికార్డులను (CDRs)
బహిరంగపరిస్తే, అందులో 99.9 శాతం మంది బీజేపీ వారే ఉంటారని స్పష్టం చేశారు. తక్షణమే ఆలయ ట్రస్ట్
కోశాధికారి రాజీనామా చేయాలని, కొత్త
సీఈఓను నియమించాలని డిమాండ్ చేశారు. కేంద్ర దర్యాప్తు సంస్థలైన ఈడీ, సీబీఐలు స్వతంత్రంగా పనిచేస్తే
ప్రతిపక్షాలను టార్గెట్ చేయడం మానేసి, ఈ
విరాళాల అక్రమాలపై విచారణ జరిపేవని ఆయన మండిపడ్డారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi