
న్యూఢిల్లీ, 09 జూలై (హి.స.)
:ఢిల్లీ-నేషనల్ క్యాపిటల్ రీజియన్ (ఎన్సీఆర్)
వ్యాప్తంగా గురువారం ఉదయం కురిసిన ఎడతెరిపి లేని భారీ వర్షం వల్ల పలు ప్రాంతాలు
జలమయమయ్యాయి. ఈ దెబ్బకు జనజీవనం స్తంభించడమే కాకుండా నోయిడా, ఘజియాబాద్లలో ఉదయం ఆఫీసులకు వెళ్లే
వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఢిల్లీ వ్యాప్తంగా రికార్డు స్థాయిలో 228.1 మిమీ వర్షపాతం నమోదు కావడంతో వాతావరణ
శాఖ 'రెడ్', 'ఆరెంజ్' అలర్ట్లు జారీ చేసింది. అయితే నరేలా, ద్వారకా వంటి ప్రధాన మురుగు కాల్వలను
అధికారులు ముందుగానే శుభ్రం చేయడం వల్ల ఎన్హెచ్పీసీ చౌక్ వంటి కీలక అండర్పాస్లలో
నీరు చేరకుండా ట్రాఫిక్ సాఫీగానే సాగింది.
కానీ
గీతా కాలనీ వంటి కొన్ని ప్రాంతాలలో భారీ వర్షం కారణంగా నీరు నిలిచిపోయింది. దీంతో
దేశ రాజధానిలో ముఖ్యమంత్రి రేఖా గుప్తా పరిస్థితిని స్వయంగా సమీక్షించి, వర్షాల ప్రభావాన్ని తగ్గించడానికి అన్ని
ప్రభుత్వ పరిపాలనా విభాగాలను హై అలర్ట్ లో ఉండాలని ఆదేశించారు.
ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన పనిచేస్తోందని, పీడబ్ల్యూడీ, ఢిల్లీ జల్ బోర్డ్, మున్సిపల్ కార్పొరేషన్ (ఎంసీడీ) బృందాలు
రంగంలోకి దిగి నీటిని తొలగిస్తూ ట్రాఫిక్ను క్రమబద్ధీకరిస్తున్నాయని సీఎం
కార్యాలయం తెలిపింది.
మరోవైపు
ఈ వర్షాలు ఉక్కపోత నుండి ఉపశమనం కలిగించినప్పటికీ, నోయిడాలోని సెక్టార్ 115, ఘజియాబాద్లోని
శాస్త్రీనగర్ వంటి ప్రాంతాల్లో వీధులు నదులను తలపించాయి. ప్రజలు మోకాళ్ల లోతు
నీటిలో నడుస్తూ ప్రయాణించాల్సి వచ్చింది. భారత వాతావరణ శాఖ (IMD) అంచనా ప్రకారం సౌత్ ఈస్ట్, ఈస్ట్, సెంట్రల్, నార్త్, వెస్ట్ ఢిల్లీ తదితర పరిసర ప్రాంతాలలో గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో, గరిష్టంగా
60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు
వీచే అవకాశం ఉంది. జూలై 10 మరియు 11 తేదీలలో కూడా ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, పంజాబ్ రాష్ట్రాల్లో విస్తారంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని
వాతావరణ శాఖ హెచ్చరించింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi