
కడప,, 11 ఆగస్టు (హి.స.)
జిల్లాలో బీటెక్ విద్యార్థి కిడ్నాప్ ఘటన కలకలం రేపింది. వల్లూరు పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం రాత్రి బీటెక్ విద్యార్థి సాయి ప్రణవ్ శర్మను ముగ్గురు వ్యక్తులు కారులో బలవంతంగా ఎక్కించుకుని తీసుకెళ్లారు. విద్యార్థి కనిపించకుండా పోవడంతో ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు వెంటనే వల్లూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి.. శర్మ గాలింపు కోసం ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు.
సాయి ప్రణవ్ శర్మను తీసుకెళ్లిన కారు కదలికలను పోలీసులు వెంటనే గుర్తించారు. ఈ విషయాన్ని గమనించిన కిడ్నాపర్లు.. పోలీసుల వాహనాన్ని ఢీకొట్టేందుకు యత్నించారు. దీంతో పోలీసు బృందాలు వెంటనే అప్రమత్తమయ్యాయి. వ్యూహాత్మకంగా వ్యవహరించి కిడ్నాపర్ల కారును అడ్డుకున్నారు.
అనంతరం కారులోని ముగ్గురు కిడ్నాపర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి చెరలో ఉన్న సాయి ప్రణవ్ శర్మను రక్షించారు. ఆ తర్వాత కిడ్నాపర్లను వల్లూరు పోలీస్ స్టేషన్కు తరలించారు. వారిని విచారిస్తున్నారు. శర్మను ఎందుకు కిడ్నాప్ చేశారు?. దీని వెనుక ఉన్న కారణం ఏమిటి?. అనే కోణాల్లో పోలీసులు విచారణ చేస్తున్నారు.
--
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ