
అమరావతి, 11 ఆగస్టు (హి.స.)
పర్యావరణహిత రవాణా వ్యవస్థను ప్రోత్సహించేందుకు గుంటూరు నగరపాలక సంస్థ కీలక అడుగు వేసింది. ఇంధన వాడకాన్ని తగ్గించి.. విద్యుత్తు వాహనాల వినియోగాన్ని పెంచే లక్ష్యంతో పది ముఖ్యమైన ప్రాంతాల్లో ‘పబ్లిక్ ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు’ ఏర్పాటు చేయబోతోంది. రాష్ట్ర ప్రభుత్వ ‘సుస్థిర ఎలక్ట్రిక్ మొబిలిటీ పాలసీ (4.0) 2024-29’, ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ 4.0, పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ‘వనరుల పరిరక్షణ కార్యాచరణ ప్రణాళిక’ మార్గదర్శకాలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నారు.
కలెక్టర్, జీఎంసీ ప్రత్యేకాధికారి సాయికాంత్వర్మ జులై 17న కౌన్సిల్ తీర్మానం ద్వారా ప్రతిపాదనలకు ఆమోదం తెలిపారు. అనంతరం ప్రభుత్వ ఆమోదం కోరుతూ జీఎంసీ కమిషనర్ మయూర్ అశోక్ జులై 20న సీడీఎంఏకు సమగ్ర నివేదిక పంపించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ