
విశాఖపట్నం: , 11 ఆగస్టు (హి.స.)
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక రాజధాని విశాఖపట్నంలో ఈరోజు ఉదయం నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో నగరంలోని గాజువాక, మధురవాడ, జగదాంబ జంక్షన్ వంటి ప్రధాన కూడళ్లలో రహదారులు మోకాళ్లోతు నీటితో నిండిపోయాయి. దీనివల్ల ఉదయం కార్యాలయాలకు, విద్యాసంస్థలకు వెళ్లే వాహనదారులు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్లో చిక్కుకుని తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
నగరపాలక సంస్థ (GVMC) సిబ్బంది తక్షణమే రంగంలోకి దిగి డ్రైనేజీలలో పేరుకుపోయిన వ్యర్థాలను తొలగిస్తూ నీరు వేగంగా వెళ్లేలా చర్యలు తీసుకుంటున్నారు. రాబోయే 24 గంటల్లో ఉత్తర కోస్తా తీరప్రాంతాల్లో గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. మత్స్యకారులు ఎవరూ సముద్రంలోకి వేటకు వెళ్లరాదని, తీరప్రాంత లోతట్టు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విశాఖ జిల్లా కలెక్టర్ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi