
హైదరాబాద్, 12 ఆగస్టు (హి.స.) సివిల్ సప్లయిస్ శాఖలో డిఫాల్ట్ అయిన రైస్మిల్లర్ల నుంచి బకాయిలను వసూల్ చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి (Telangana CM Revanth Reddy) ఆదేశించారు. బకాయిల వసూళ్లకు ఒక విధానాన్ని రూపొందించాలని దిశానిర్దేశం చేశారు. కేబినెట్ సబ్కమిటీలో దీనిపైన చర్చించి నిర్ణయం తీసుకోవాలని సూచించారు. బకాయిల వసూళ్లే ప్రధాన లక్ష్యంగా చర్యలు ఉండాలని మార్గనిర్దేశం చేశారు. మిల్లర్ల బ్లాక్ మెయిల్ను సహించనని హెచ్చరించారు.
ఈరోజు (బుధవారం) ఎంసీఆర్హెచ్ఆర్డీ బోధి పెవిలియన్లో సివిల్ సప్లయిస్ శాఖపై ముఖ్యమంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ చైర్మన్ స్టీఫెన్ రవీంద్ర, సీఎంఓ ముఖ్య కార్యదర్శి శేషాద్రి, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలపై అధికారులకు సీఎం దిశానిర్దేశం చేశారు. ఉద్దేశ పూర్వకంగా డిఫాల్ట్ అయి బకాయిలు చెల్లించని రైస్ మిల్లులను స్వాధీనం చేసుకొని మహిళా సంఘాలకు అప్పగించే అవకాశాన్ని పరిశీలించాలని ముఖ్యమంత్రి సూచించారు.
మార్కెట్లో ఉన్న గోదాములను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని సీఎం రేవంత్రెడ్డి నిర్దేశించారు. అవసరమైతే మిల్లింగ్ బాధ్యతలను మహిళా సంఘాలకు అప్పగిస్తామని స్పష్టం చేశారు. ఐదు నియోజకవర్గాల్లో మహిళా సంఘాలకు 50 నుంచి 100 ఎకరాల్లో గోదాంల నిర్మాణం కోసం పైలట్ ప్రాజెక్ట్ చేపట్టాలని ఆదేశించారు. ధాన్యం ఎక్కువ దిగుబడి అయ్యే ప్రాంతాలను పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేయాలని సూచించారు. గోదాంల నిర్మాణంలో గ్రామీణ ఉపాధి హామీ పథకంలో నిధులను వినియోగించుకోవాలని మార్గనిర్దేశం చేశారు. ప్రతి జిల్లాకు ఓ నోడల్ అధికారిని నియమించాలని సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్