
అమరావతి, 13 ఆగస్టు (హి.స.)
అమరావతి రాజధాని నిర్మాణంలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. రాజధానిలో నిర్మాణం పూర్తైన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల భవన సముదాయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. ఈరోజు(గురువారం) నూతన భవన సముదాయాన్ని సీఎం చేతుల మీదుగా సాధారణ పరిపాలన శాఖకు(జీఏడీ) సీఆర్డీఏ అప్పగించింది. రాయపూడి వద్ద 12 టవర్లుగా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల నివాస భవన సముదాయాన్ని నిర్మించారు. ఒక్కొక్కటి 3,500 చదరపు అడుగుల వైశాల్యంతో 288 ఫ్లాట్లను సీఆర్డీఏ నిర్మించింది.
అత్యాధునిక వసతులతో భవనాలను నిర్మించిన సీఆర్డీఏ.. టవర్స్ మధ్య ప్రత్యేక లాన్స్ను పెంచింది. అధునాతనంగా నిర్మించిన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ఫ్లాట్లను మంత్రులు నారాయణ, నాదెండ్ల మనోహర్లతో కలిసి సీఎం చంద్రబాబు పరిశీలించారు. ఇక, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల భవనాల అప్పగింత అనంతరం వాటి నిర్వహణ బాధ్యతలను సాధారణ పరిపాలన శాఖ చూసుకోనుంది. అనంతరం ప్రభుత్వం నిర్ణయించే విధానానికి అనుగుణంగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కేటాయింపు ప్రక్రియ చేపట్టే అవకాశం ఉంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ