
అమరావతి, 13 ఆగస్టు (హి.స.)
ఏపీరాజధాని అమరావతి సీడ్ యాక్సెస్రహదారిలోని S ఆకారపు మలుపుపై కొందరు పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ తెలిపింది. అమరావతిని ఇతర ప్రాంతాలతో కనెక్ట్ చేసే ప్రధాన సీడ్ యాక్సెస్ రహదారి నిర్మాణంపై అపోహలకు తావులేదని స్పష్టం చేసింది. భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా సీడ్ యాక్సెస్ రహదారి నిర్మాణం ఉంటుందని పేర్కొంది. ఈ రహదారి మూడో దశలో విజయవాడ – చెన్నై నేషనల్ హైవే కనెక్టివిటీకి అనుగుణంగా ఈ నిర్మాణం ఉంటుందని చెప్పింది.
సీడ్ యాక్సెస్ రహదారిని మణిపాల్ హాస్పిటల్ దగ్గర జాతీయ రహదారితో అనుసంధానం చేసేలా ప్రణాళికలు చేస్తున్నట్లు పురపాలక శాఖ వెల్లడించింది. ఎలివేటెడ్ కారిడార్ నిర్మించేందుకు అనువుగా ప్రస్తుత సీడ్ యాక్సెస్ రహదారి నిర్మాణం ఉంటుందని తెలిపింది. 2017 ప్రణాళిక ప్రకారమే దొండపాడు నుంచి తాడేపల్లి వరకూ ఎలివేటెడ్ కారిడార్ను నిర్మిస్తున్నట్లు పేర్కొంది. రాజధాని అమరావతికి, మంగళగిరి, విజయవాడలతో కనెక్టివిటీ పెంచేలా స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రహదారులు అందుబాటులోకి వచ్చాయని తెలిపింది. సీడ్ యాక్సెస్ రహదారి కనెక్టివిటీ అందుబాటులోకి రావటంతో కృష్ణా కరకట్టపై వాహనాల రద్దీ తగ్గనుందని పేర్కొంది. ఈ వాస్తవాలను గమనించి అపోహలకు గురి కావొద్దని ప్రజలకు పురపాలక శాఖ విజ్ఞప్తి చేసింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ