
హైదరాబాద్, 14 ఆగస్టు (హి.స.)
రాష్ట్రంలో పారిశ్రామిక రంగాన్ని బలోపేతం చేయడం, దేశ విదేశీ పెట్టుబడులను పెద్ద ఎత్తున ఆకర్షించడమే ధ్యేయంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సరికొత్త పారిశ్రామిక విధానాన్ని ప్రవేశపెట్టింది. ఈ నూతన విధానం ప్రకారం, ఏపీఐఐసీ (Andhra Pradesh Industrial Infrastructure Corporation) ద్వారా పారిశ్రామిక భూముల కేటాయింపు ప్రక్రియ పూర్తయిన వెంటనే, సదరు పరిశ్రమకు అవసరమైన అన్ని రకాల ప్రభుత్వ అనుమతులను (Clearances) సింగిల్ విండో పద్ధతిలో త్వరితగతిన మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
గతంలో పారిశ్రామికవేత్తలు భూమి పొందిన తర్వాత కూడా కాలుష్య నియంత్రణ మండలి, విద్యుత్ శాఖ, నీటి సరఫరా మరియు స్థానిక సంస్థల నుండి అనుమతులు పొందడానికి నెలల తరబడి ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వచ్చేది. ఈ ఆలస్యం వల్ల పెట్టుబడిదారులు వెనకడుగు వేసేవారు. ఈ లోపాన్ని సవరిస్తూ తీసుకొచ్చిన కొత్త సరళీకృత విధానం వల్ల ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ (Ease of Doing Business) ర్యాంకింగ్స్లో ఆంధ్రప్రదేశ్ మరింత మెరుగైన స్థానాన్ని కైవసం చేసుకుంటుందని పరిశ్రమల శాఖ అధికారులు విశ్వాసం వ్యక్తం చేశారు.
ఈ విప్లవాత్మక నిర్ణయం ద్వారా ఐటీ, ఫార్మా, ఆటోమొబైల్ మరియు తయారీ రంగాలకు చెందిన ప్రముఖ అంతర్జాతీయ కంపెనీలు ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమలు స్థాపించేందుకు ముందుకు వస్తాయని ప్రభుత్వం భావిస్తోంది. తద్వారా రాష్ట్రంలోని లక్షలాది మంది నిరుద్యోగ యువతకు స్థానికంగానే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఐటీ మరియు పరిశ్రమల శాఖ మంత్రి ధీమా వ్యక్తం చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi