
హైదరాబాద్, 16 ఆగస్టు (హి.స.) శంషాబాద్ రాజీవ్గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో వరుస ఘటనలు కలకలం రేపాయి. సౌదీ అరేబియాలోని జడ్డా వెళ్లాల్సిన ఓ ప్రయాణికుడి వద్ద నకిలీ టికెట్ను అధికారులు గుర్తించారు. అనుమానం రావడంతో తనిఖీలు నిర్వహించగా టికెట్ నకిలీదిగా తేలింది. దీంతో సదరు ప్రయాణికుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మరోవైపు ఢిల్లీ వెళ్లేందుకు ఎయిర్పోర్టుకు వచ్చిన ఓ ప్రయాణికుడి వద్ద బుల్లెట్లు లభించడం సంచలనంగా మారింది.
తనిఖీల్లో భాగంగా సీఐఎస్ఎఫ్ అధికారులు బుల్లెట్లను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ప్రయాణికుడిని అదుపులోకి తీసుకున్నారు. ఇరువురు ప్రయాణికులను అదుపులోకి తీసుకున్న అధికారులు ఈ రెండు ఘటనలపై దర్యాప్తు చేపట్టారు. నకిలీ టికెట్ ఎక్కడి నుంచి వచ్చింది?, బుల్లెట్లు ప్రయాణికుడి వద్దకు ఎలా వచ్చాయి? అనే కోణాల్లో విచారణ కొనసాగుతోంది. ఘటనలకు సంబంధించిన పూర్తి వివరాలు అధికారుల దర్యాప్తులో వెల్లడి కానున్నాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్