
న్యూఢిల్లీ: , 01 సెప్టెంబర్ (హి.స.)
గత 2020 నాటి ఈశాన్య ఢిల్లీ అల్లర్ల సమయంలో ముర్సలీన్ అనే వ్యక్తి హత్యకు గురైన కేసులో నిందితులుగా ఉన్న 12 మందిని ఇక్కడి కర్కర్దూమా కోర్టు నిర్దోషులుగా ప్రకటిస్తూ సంచలన తీర్పునిచ్చింది. చట్టవ్యతిరేకమైన ఒక గుంపు లేదా మూకలో కేవలం సభ్యుడిగా ఉన్నంత మాత్రాన ఒక వ్యక్తిపై నేరపూరిత బాధ్యతను మోపలేమని కోర్టు స్పష్టం చేసింది.
ఈ కేసును విచారించిన అదనపు సెషన్స్ జడ్జి ప్రవీణ్ సింగ్ ఆగస్టు 25నే ఈ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ తీర్పు ద్వారా లోకేష్ సోలాంకి, పంకజ్ శర్మ, అంకిత్ చౌదరి, ప్రిన్స్, జతిన్ శర్మ, హిమాన్షు ఠాకూర్, వివేక్ పంచల్, రిషబ్ చౌదరి, సుమిత్ చౌదరి, టింకూ అరోరా, సందీప్, సాహిల్ అనే 12 మందికి ఈ హత్యారోపణల నుండి విముక్తి లభించింది.
సాక్ష్యాలు నిరూపించడంలో ప్రాసిక్యూషన్ విఫలం:
నిందితులు నేరానికి పాల్పడినట్లు నిరూపించడానికి ప్రాసిక్యూషన్ తగిన ఆధారాలను సమర్పించలేకపోయిందని కోర్టు పేర్కొంది. నిందితుల్లో ప్రతి ఒక్కరూ చేసిన నిర్దిష్టమైన చట్టవ్యతిరేక చర్యలను నిరూపించాల్సి ఉంటుందని, అంతేకాని వారు కేవలం ఒక అల్లరి మూకలో ఉన్నారనే కారణంతో శిక్షించలేమని న్యాయమూర్తి స్పష్టం చేశారు.
ఈ కేసులో ప్రాసిక్యూషన్ తరఫున కీలక ప్రత్యక్ష సాక్షిగా ఉన్న దివేష్ రాజ్పుత్ అనే వ్యక్తి విచారణ సమయంలో మాట మార్చాడు (టర్న్ హోస్టైల్). అతనిని ఎంత క్రాస్ ఎగ్జామినేషన్ చేసినప్పటికీ, నిందితులకు ఆ అల్లరి మూకతో కానీ, హత్యతో కానీ సంబంధం ఉన్నట్లు ఎలాంటి ఆధారాలు లభించలేదు. మరో సాక్షి నిసార్ అహ్మద్ కూడా నిందితులు నేరానికి పాల్పడినట్లు ఎక్కడా పేర్కొనలేదు.
ఒక్క నిందితుడికి మాత్రం శిక్ష:
ఈ కేసులో హత్యారోపణల నుండి విముక్తి పొందినప్పటికీ, హిమాన్షు ఠాకూర్ అనే నిందితుడిని ఐపీసీ సెక్షన్ 411 కింద కోర్టు దోషిగా తేల్చింది. ఎందుకంటే హత్యకు గురైన ముర్సలీన్కు చెందిన మొబైల్ ఫోన్, అందులోని సిమ్ కార్డ్ ఇతని వద్ద లభించాయి.
నేపథ్యం:
2020 ఫిబ్రవరి 28న ఈశాన్య ఢిల్లీలో జరిగిన అల్లర్ల సమయంలో జోహ్రీపూర్ తిరాహా సమీపంలోని ఒక డ్రైనేజీలో ముర్సలీన్ మృతదేహం లభ్యమైంది. దీనిపై ఢిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కాగా, 2020 ఫిబ్రవరిలో జరిగిన ఈ అల్లర్లలో దాదాపు 53 మంది ప్రాణాలు కోల్పోగా, 200 మందికి పైగా గాయపడ్డారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi