
హైదరాబాద్, 01 సెప్టెంబర్ (హి.స.)
గోవా నుంచి ఢిల్లీ బయలుదేరిన ఇండిగో విమానంలో మంగళవారం ఉదయం ఇంజిన్ సమస్య తలెత్తింది. దీంతో విమానాన్ని తిరిగి గోవా విమానాశ్రయానికి మళ్లించారు. పరిస్థితిని గుర్తించిన ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ) కొద్దిసేపు ఫుల్ ఎమర్జెన్సీ ప్రకటించింది. విమానం సురక్షితంగా ల్యాండ్ కావడంతో ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం జరగలేదు.
ఇండిగో 6ఈ 2102 విమానం ఉదయం 9:16 గంటలకు గోవా నుంచి ఢిల్లీకి బయలుదేరింది. కొద్దిసేపటికే విమానంలోని ఓ ఇంజిన్లో సమస్య గుర్తించారు. దీంతో పైలట్లు విమానాన్ని గోవా వైపు మళ్లించారు. ఉదయం 9:30 గంటల సమయంలో ఏటీసీ ఫుల్ ఎమర్జెన్సీ ప్రకటించింది.
విమానం దక్షిణ మహారాష్ట్ర తీర ప్రాంతం మీదుగా సుమారు 14 వేల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తున్న సమయంలో వెనక్కి మళ్లినట్లు ఫ్లైట్ రాడార్24 డేటా తెలిపింది. గోవాకు చేరుకున్న విమానం ఉదయం 9:51 గంటలకు రన్వే 28పై సురక్షితంగా ల్యాండ్ అయింది. అనంతరం స్టాండ్ 6 వద్ద పార్క్ చేశారు. దీంతో ఉదయం 10:03 గంటలకు ఏటీసీ ఎమర్జెన్సీని ఉపసంహరించింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi