
హైదరాబాద్, 01 సెప్టెంబర్ (హి.స.)
తనపై భౌతిక దాడి జరిగిందంటూ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన ఆరోపణలు నిజమేనని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ధ్రువీకరించారు. 2022లో మంగళగిరిలో జరిగిన వైసీపీ ప్లీనరీ సమావేశంలో సజ్జల రామకృష్ణారెడ్డి తనపై దాడి చేశారని, ఈ విషయం అధినేత జగన్కు తెలిసినా ఆయన ప్రేక్షకపాత్ర వహించారని విజయసాయిరెడ్డి ఇటీవల ఓ బహిరంగ లేఖలో ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ ఆరోపణలపై సజ్జల నేరుగా స్పందించనప్పటికీ, అప్పట్లో వైసీపీలో ఉన్న కోటంరెడ్డి ఈ ఘటనపై స్పందించి కీలక విషయాలు బయటపెట్టారు.
మంగళగిరి ప్లీనరీలో వేదికపై ఎవరితో మాట్లాడించాలనే అంశంపై విజయసాయిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగిందని కోటంరెడ్డి తెలిపారు. ఈ క్రమంలోనే స్టేజీ పక్కన ఉన్న రెస్ట్రూమ్లోకి విజయసాయిరెడ్డిని తీసుకెళ్లిన సజ్జల, ఆయన చొక్కా పట్టుకుని కొట్టారని కోటంరెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. అయితే, విజయసాయిరెడ్డి ఎందుకో తిరిగి దాడి చేయలేదని ఆయన పేర్కొన్నారు. ఈ ఘటనతో విజయసాయిరెడ్డి ఆరోపణలకు బలం చేకూరినట్లయింది. విలేకరుల సమావేశంలో మాట్లాడిన కోటంరెడ్డి, విజయసాయిరెడ్డి పేర్కొన్నట్లుగానే ఈ దాడి జరిగిందని స్పష్టం చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi