మూడు రోజుల్లో తల్లికి వందనం నిధులు
మూడు రోజుల్లో తల్లికి వందనం నిధులు
ap


హైదరాబాద్, 01 సెప్టెంబర్ (హి.స.)

ఆంధ్రప్రదేశ్‌లో 'తల్లికి వందనం' పథకం కింద డబ్బులు పడకుండా ఎదురుచూస్తున్న విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మరో మూడు రోజుల్లో అర్హులైన మిగిలిన విద్యార్థుల తల్లుల ఖాతాల్లో ఈ నిధులను జమ చేయనున్నట్లు వెల్లడించింది. ముఖ్యంగా ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరంలో చేరిన విద్యార్థులకు ఈ పథకం కింద ఆర్థిక సహాయం అందనుంది.

వాస్తవానికి ఈ నిధులను ఆగస్టు 30వ తేదీనే లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయాల్సి ఉండగా, కొన్ని సాంకేతిక కారణాల వల్ల వాయిదా పడింది. ఈ నేపథ్యంలో అధికారులు లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను పునఃసమీక్షించారు. ప్రస్తుతం గ్రామ, వార్డు సచివాలయాల నుంచి అర్హులైన లబ్ధిదారుల జాబితాలను స్వీకరిస్తున్నారు. ఈ జాబితాల పరిశీలన పూర్తయిన వెంటనే ఆర్థిక శాఖ నేరుగా ఖాతాల్లోకి నగదును జమ చేయనుంది.

ఈ విడతలో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 2.80 లక్షల మంది విద్యార్థులు ప్రయోజనం పొందనున్నారు. గతంలో అర్హత ఉండి కూడా వివిధ కారణాలతో నిధులు అందని వారికి సైతం ఈ దఫాలోనే నగదు జమ చేయనున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. ప్రభుత్వ తాజా నిర్ణయంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande