
కర్నూలు, 04 సెప్టెంబర్ (హి.స.) సెప్టెంబర్ 9 వరకు తెలుగు రాష్ట్రాలలో
చెదురుమదురు జల్లులు, వీచే గాలులు, విపరీతమైన ఉక్కపోతతో ప్రజలు ఇబ్బందులు పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ స్పష్టం చేసింది.
మధ్యప్రదేశ్ పరిసరాల్లో కేంద్రీకృతమైన తీవ్ర అల్పపీడనం పశ్చిమ దిశగా కదులుతుండటంతో ఏపీ, తెలంగాణ ప్రాంతాలపై దాని తీవ్రత గణనీయంగా తగ్గింది. ఫలితంగా తెలుగు రాష్ట్రాల్లో సెప్టెంబర్ 4న పొడి వాతావరణంతో పాటు ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటోంది. ఆకాశంలో మేఘాలు వచ్చిపోతున్నప్పటికీ నైరుతి రుతుపవనాలలో తేమ తగ్గడం వల్ల పెను వర్షాలు పడే అవకాశం లేదని అధికారులు తెలిపారు.
ఇరు రాష్ట్రాల్లో అక్కడక్కడా చెదురుమదురు జల్లులు పడే వాతావరణం ఉంది. ఆంధ్రప్రదేశ్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 36 డిగ్రీల సెల్సియస్కు, తెలంగాణలో 33 డిగ్రీలకు చేరే అవకాశం ఉండటంతో వాతావరణంలో వేడి పెరిగింది.
6 రోజుల పాటు జల్లుల అలర్ట్ మధ్యప్రదేశ్ నుంచి ఈశాన్య బంగాళాఖాతం వరకు రుతుపవన ద్రోణి విస్తరించి ఉండటంతో ఐఎమ్డీ సెప్టెంబర్ 4 నుంచి 9 వరకు కీలక హెచ్చరికలు జారీ చేసింది. కోస్తాంధ్ర, యానాం, రాయలసీమతో పాటు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో గంటకు 30 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముంది. సెప్టెంబర్ 5 వరకు కోస్తా, రాయలసీమల్లో ఉరుములు, మెరుపులతో కూడిన బలమైన గాలులు వీస్తాయి. ఆ తర్వాత కూడా సెప్టెంబర్ 9 వరకు అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. తీరప్రాంత జిల్లాల్లో గాలిలో తేమ శాతం ఎక్కువగా ఉండటంతో విపరీతమైన ఉక్కపోత వేధిస్తుంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV