దర్శకుడు కాశీనాథుని విశ్వనాథ్ కన్నుమూత
తెలంగాణ : హైదరాబాద్ : ఫిబ్రవరి 3( హింస) కళాతపస్విగా పేరొందిన విఖ్యాత దర్శకుడు కాశీనాథుని విశ్వనాథ్ (
....


తెలంగాణ : హైదరాబాద్ : ఫిబ్రవరి 3( హింస)

కళాతపస్విగా పేరొందిన విఖ్యాత దర్శకుడు కాశీనాథుని విశ్వనాథ్ (92) ఇక లేరు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన గురువారం రాత్రి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కుటుంబసభ్యులు జూబ్లీహిల్స్లోని అపోలో ఆసుపత్రికి తరలించగా... అప్పటికే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. బాపట్ల జిల్లా రేపల్లెలో కాశీనాథుని సుబ్రహ్మణ్యం, సరస్వతి దంపతులకు 1930 ఫిబ్రవరి 19న విశ్వనాథ్ జన్మించారు. గుంటూరు హిందూ కళాశాలలో ఇంటర్మీడియట్, ఆంధ్రా క్రిస్టియన్ కళాశాలలో బీఎస్సీ పూర్తి చేశారు. ఆయన తండ్రి చెన్నైలోని విజయవాహినీ స్టూడియోలో పనిచేసేవారు. దీంతో విశ్వనాథ్ డిగ్రీ పూర్తవగానే అదే స్టూడియోలో సౌండ్ రికార్డిస్ట్గా సినీజీవితాన్ని ప్రారంభించారు. పాతాళభైరవి సినిమాకు అసిస్టెంట్ రికార్డిస్ట్గా పనిచేశారు. తర్వాత ఆదుర్తి సుబ్బారావు దగ్గర అసోసియేట్గా చేరారు. కొన్ని చిత్రాలకు కథారచనలో పాలుపంచుకున్నారు. అలా రాణిస్తున్న సమయంలో దుక్కిపాటి మధుసూదనరావు 1965లో ఆత్మగౌరవం సినిమాకు దర్శకుడిగా అవకాశం ఇచ్చారు. ఆ తొలి చిత్రానికే నంది అవార్డు సాధించిన విశ్వనాథ్... తన సినీప్రయాణంలో సాగర సంగమం, స్వాతిముత్యం, సిరిసిరిమువ్వ, శ్రుతిలయలు, సిరివెన్నెల, ఆపద్బాంధవుడు లాంటి అనేక ఆణిముత్యాలను అందించి.. తెలుగు సినిమా స్థాయిని విశ్వవ్యాప్తం చేశారు. విశ్వనాథ్కు 1992లో పద్మశ్రీ, 2017లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డులు వచ్చాయి. అదే ఏడాది రఘుపతి వెంకయ్య అవార్డు దక్కింది. నంది, ఫిల్మ్ఫేర్ అవార్డులు ఆయన ఖాతాలో చేరాయి.

పుట్ట సుమన్, హిందూస్తాన్ సమాచార


 rajesh pande