అమరావతి, 22 అక్టోబర్ (హి.స.)అమరావతి డ్రోన్ సమ్మిట్-2024’ ప్రారంభమైంది. మంగళగిరిలోని సీకే కన్వెన్షన్లో దీనిని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. రెండు రోజులపాటు జాతీయ స్థాయిలో ఇది జరగనుంది. సదస్సులో తొమ్మిది ప్యానల్ డిస్కషన్లు, 50 స్టాళ్లలో డ్రోన్ల ప్రదర్శన, రాష్ట్ర ముసాయిదా డ్రోన్ పాలసీ పత్రం ఆవిష్కరణ తదితర కార్యక్రమాలు ఉంటాయి. డ్రోన్ల రంగంలో రాష్ట్రాన్ని దేశంలోనే మొదటి స్థానానికి చేర్చేందుకు ఈ సదస్సు తొలి అడుగుగా మారుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ కార్యక్రమానికి కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు హాజరయ్యారు. పౌర విమానయాన శాఖ, డీఎఫ్ఐ, సీఐఐ భాగస్వామ్యంతో ఈ సదస్సు నిర్వహిస్తున్నారు.
ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి రామ్మోహన్నాయుడు మాట్లాడారు. ‘‘సీఎం చంద్రబాబు ఎప్పుడూ కొత్త ఆలోచనలు చేస్తుంటారు. యువతతో పోటీపడి ఆయన పనిచేస్తుంటారు. నూతన సాంకేతికత వినియోగంపై చర్చలు జరుపుతుంటారు. దేశాభివృద్ధికి ఎప్పుడూ ఆలోచనలు చేస్తున్న వ్యక్తి ప్రధాని నరేంద్ర మోదీ. ప్రపంచంలోని అన్ని దేశాలు భారత్ సాధిస్తున్న అభివృద్ధిని పరిశీలిస్తున్నాయి. దేశంలో 74 ఎయిర్పోర్టుల నుంచి గత పదేళ్లలో 157కు పెరిగాయి. వచ్చే 20 ఏళ్లలో 200కుపైగా ఎయిర్పోర్టులు వస్తాయి. విమానాల్లో ప్రయాణికుల సంఖ్య పెరుగుతోంది’’ అని అన్నారు. ఈజ్ఆఫ్ లివింగ్, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ తమ ప్రభుత్వ విధానమని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ వివరించారు
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు