అమరావతి,17 ఏప్రిల్ (హిం.స)): రాష్ట్రంలో లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలకు అసలైన ఘట్టం గురువారం (18న) ప్రారంభమవుతోంది. ఎన్నికల నోటిఫికేషన్ జారీతో నామినేషన్ల దాఖలు ప్రక్రియ ఆ రోజు మొదలుకానుంది. ఇది 25వ తేదీతో ముగుస్తుంది. 26న నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. ఉపసంహరణకు చివరి తేదీ ఈ నెల 29. పోలింగ్ మే 13, ఓట్ల లెక్కింపు జూన్ 4న జరుగుతాయి. నోటిఫికేషన్ జారీతో ప్రారంభమయ్యే ఎన్నికల ప్రక్రియ నిర్వహణకు జిల్లా ఎన్నికల అధికారులు అందరూ సిద్ధం కావాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈవో) ముఖేశ్కుమార్ మీనా ఆదేశించారు. ఎన్నికలను శాంతియుతంగా, స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా, న్యాయబద్ధంగా నిర్వహించాలని.. రోజూ క్రమం తప్పకుండా తమకు నివేదికలను పంపేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. మంగళవారమిక్కడ అమరావతి సచివాలయం నుంచి అన్ని జిల్లాల ఎన్నికల అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. 18న నోటిఫికేషన్ జారీనుంచి నివేదికలను రోజూ కేంద్ర ఎన్నికల కమిషన్ (ఈసీఐ)కి పంపాల్సి ఉంటుందని, ఈ విషయంలో అలసత్వం వహించకుండా క్రమం తప్పకుండా నివేదికలు పంపాలన్నారు. ఓటర్ల గుర్తింపుకార్డుల పంపిణీపై ప్రత్యేక దృష్టి సారించాలని.. కార్యాలయాల్లో గానీ, పోస్టాఫీసుల్లో గానీ పెండింగ్ లేకుండా చూడాలని తెలిపారు. ఎపిక్ కార్డుల పంపిణీపై మే 4న ఈసీ వీడియోకాన్ఫరెన్స్ నిర్వహిస్తుందని, ఆలోపే పెండింగ్లో ఉన్న కార్డుల పంపిణీ పూర్తిచేయాలని ఆదేశించారు. సీ-విజిల్ ఫిర్యాదులను సంతృప్తికర స్థాయిలో డీఈవోలు అందరూ పరిష్కరిస్తున్నారని అభినందించారు. కౌంటింగ్ పరిశీలకుల నియామకంలో మార్గదర్శకాలు పాటించాలని, అదనంగా కావలసిన పరిశీలకులు, ఏఆర్వోల ప్రతిపాదనలు సాధ్యమైనంత త్వరగా తమకు పంపాలని ఆదేశించారు
హిందూస్తాన్ సమాచార రాజీవ్