న్యూఢిల్లీ ఏప్రిల్ 19 (హిం.స) దేశంలో సార్వత్రిక మొదటి దశ పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది.
మొత్తం 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 102 స్థానాలకు శుక్రవారం పోలింగ్ జరుగుతోంది. నేడు ఉదయం 7 గంటలకే పోలింగ్ ప్రారంభం కాగా..సాయంత్రం 6 గంటలవరకూ పోలింగ్ కొనసాగనుంది.
దీంతో సాధారణ పౌరులతోపాటు ప్రముఖులు కూడా ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రాల వద్దకు తరలివెళ్లి అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.
ఇక ఉదయం 11 గంటల వరకూ త్రిపుర రాష్ట్రంలో అత్యధిక శాతం పోలింగ్ నమోదైంది . ఆ రాష్ట్రంలో 33.28 శాతం మేర పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. ఇక అత్యల్పంగా కేంద్రపాలిత ప్రాంతం లక్షద్వీప్ లో 16.33 పోలింగ్ నమోదైనట్లు తెలిపింది.
సంపత్ రావు హిందుస్థాన్ సమాచారం