హైదరాబాద్ ఏప్రిల్ 27 (హిం.స)భానుడు భగభగ మండుతున్నాడు.రోజురోజుకు భానుడి తీవ్రత ఎక్కువవుతుంది. వడగాల్పులతో జనాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఎండలు దంచికొడుతుండడంతో భయటకు రావాలంటేనే జంకుతున్నారు. ఈ క్రమంలో మరో పిడుగులాంటి వార్తను అందించింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. మరో ఐదు రోజులు తీవ్ర వడగాడ్పులు ఉంటాయని తెలిపింది.
మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, వనపర్తి, జోగులాంబ గద్వాల తదితర జిల్లాల్లో తీవ్ర వడగాడ్పులు వీచడంతో ఈ సీజన్లోనే రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పలు జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 45 సెల్సియస్ డిగ్రీలకుపైగా నమోదైనట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. అత్యధికంగా కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో 45.6, నల్లగొండ జిల్లా నిడమనూర్, పెద్దపల్లి జిల్లా మంథనిలో 45.2, యాదాద్రి భువనగిరి జిల్లా మర్యాల, కరీంనగర్ జిల్లా వీణవంక, జగిత్యాల జిల్లా వెల్లటూర్, కాల్వాయి, నల్లగొండ జిల్లా మాడ్గులపల్లిలో 45.1, గా నమోదయాయి.
సంపత్ రావు హిందుస్థాన్ సమాచారం