గరియాబంద్, నౌపాడ 21 జనవరి (హి.స.)ఛత్తీస్గఢ్-ఒడిశా (Chhattisgarh-Odisha) సరిహద్దులో భారీ ఎన్కౌంటర్ జరిగింది. నేడు గరియాబంద్ జిల్లాలో జరిగిన ఎదురుకాల్పుల్లో 14 మంది మావోయిస్టులు మృతి చెందారు. దీంతో జనవరి 19 రాత్రి నుంచి పలుమార్లు జరిగిన ఎన్కౌంటర్లో మృతిచెందిన మావోయిస్టుల సంఖ్య 16కు చేరిందని పోలీసులు వెల్లడించారు.
మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా సరిహద్దు జిల్లాలైన గరియాబంద్, నౌపాడలో ఛత్తీస్గఢ్, ఒడిశా పోలీసులు, సీఆర్పీఎఫ్ సిబ్బంది కలిసి ప్రత్యేక ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. ఈక్రమంలో జరిగిన ఎన్కౌంటర్లో నిన్న ఇద్దరు మావోయిస్టులు మృతి చెందగా.. తెల్లవారుజామున జరిపిన గాలింపులో మరో 14 మంది మృతదేహాలు లభ్యమయ్యాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. అలాగే భారీస్థాయిలో ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఇంకా ఈ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ జరుగుతోంది. ఇందులో వెయ్యి మంది వరకు భద్రతా సిబ్బంది పాల్గొన్నట్లు తెలుస్తోంది.ఈ ఎదురుకాల్పుల్లో మావోయిస్టు కీలక నేతలు మృతి చెందారు. వారిలో కేంద్ర కమిటీ సభ్యులు చలపతి అలియాస్ రామచంద్రారెడ్డి, మనోజ్, స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు గుడ్డు ఉన్నారు. చిత్తూరు జిల్లావాసి అయిన చలపతిపై ప్రభుత్వం గతంలో రూ.కోటి రివార్డు ప్రకటించింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు