ప్రయాగ్రాజ్, 4 ఫిబ్రవరి (హి.స.) -ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో మహా కుంభమేళాకు భక్తులు భారీగా పోటెత్తుతున్నారు. ఇప్పటికే కోట్లాది మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించగా.. ఇక సోమవారం వసంత పంచమి కారణంగా భక్తులు అంతకంతకు రెట్టింపుగా తరలివచ్చారు. ఇక మౌని అమవాస్య రోజున జరిగిన తొక్కిసలాట తర్వాత యోగి సర్కార్ అప్రమత్తమైంది. భద్రతను కట్టుదిట్టం చేశారు. ఎక్కడికక్కడే పోలీస్ బందోబస్తును పట్టిష్టం చేశారు. ఫిబ్రవరి 3 సాయంత్రం 4 గంటల వరకు గంగా, యమునా , పౌరాణిక సరస్వతి సంగమం దగ్గర సుమారు రెండు కోట్ల మంది భక్తులు పుణ్య స్నానం చేశారని యూపీ సర్కార్ తెలిపింది. రాత్రి వరకు దాదాపు ఐదు కోట్ల మంది యాత్రికులు వస్తారని అంచనా వేస్తున్నట్లు తెలిపింది. జనవరి 13న మహా కుంభమేళా ప్రారంభమైనప్పటి నుంచి మొత్తం 34.97 కోట్ల మంది భక్తులు వచ్చారని వెల్లడించింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు