తెలంగాణ, హైదరాబాద్ 21 జనవరి (హి.స.)
జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 36లో
కబ్జాకు గురైన 1,260 చదరపు గజాల స్థలాన్ని జీహెచ్ఎంసీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
జూబ్లీహిల్స్ కో ఆపరేటివ్ సొసైటీ లే అవుట్ లో పోలీస్ స్టేషన్ వెనుక జీహెచ్ఎంసీకి చెందిన 1,260 చదరపు గజాల స్థలం కబ్జాకు గురైనట్లు తెలుసుకున్న మేయర్ గద్వాల విజయలక్ష్మి స్వయంగా వెళ్లి పరిశీలించి, వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీచేశారు. ముగ్గురు వ్యక్తులు కలిసి ఆ స్థలాన్ని ఆక్రమించుకున్న ట్లు అధికారులు గుర్తించారు. చర్యలు చేపట్టిన అధికారులు మంగళవారం జేసీబీ సహాయంతో దగ్గరుండి అక్రమ నిర్మాణాలను కూల్చి వేయించారు.
ప్రభుత్వ స్థలాన్ని ఎవరైనా కబ్జా చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కాగా, ఈ ల్యాండ్ ను అక్కడ ఉన్నవాళ్లు సర్వీస్ రోడ్డు మాదిరి ఉపయోగించుకుంటున్నారు. వరదలు వచ్చినప్పుడు లే అవుట్ లోని వాళ్లు మెయిన్ రోడ్లపై నడిచే పరిస్థితి ఉండదు. అలాంటప్పుడు ఈ ల్యాండ్ పై నుంచే రాకపోకలు కొనసాగించేవాళ్లు. అయితే, ఈ స్థలాన్ని ముగ్గురు వ్యక్తులు ఆక్రమించినట్టుగా మేయర్ గద్వాల విజయలక్ష్మి దృష్టికి వచ్చింది. దీంతో ఆమె సోమవారం ఉదయం జీహెచ్ఎంసీ అధికారులతో కబ్జాకు గురైన స్థలాన్ని పరిశీలించారు. ముగ్గురిలో ఒక వ్యక్తి కూరగాయలు, పండ్ల చెట్లు నాటగా.. మరొకరు గార్డెన్ ఏర్పాటు చేసి కాంపౌండ్ వాల్ కట్టుకున్నాడు. ఇంకొకరు ఏకంగా ఓ గదినే నిర్మించినట్లు మేయర్ గుర్తించారు. జీహెచ్ఎంసీ బోర్డును కూడా తొలగించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..