
హైదరాబాద్, 5 నవంబర్ (హి.స.)చత్తీస్గడ్లో మరోసారి భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఛత్తీస్గఢ్- తెలంగాణ సరిహద్దులోని బీజాపూర్ జిల్లాలో బుధవారం భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. వివరాల్లోకి వెళ్తే.. బీజాపూర్ జిల్లాలోని అన్నారం-మరిమల అడవుల్లో మావోయిస్టు కదలికలు ఉన్నట్టు సమాచారంతో భద్రతా బలగాలు బుధవారం ఆ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ విషయం తెలసుకున్న మావోలు భద్రతా బలగాలను చుట్టుముట్టినట్టు తెలుస్తోంది.
దీంతో అప్రమత్తమైన భద్రతా బలగాలు మావోయిస్టులపై ఎదురుకాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో సుమారు ముగ్గురు మావోయిస్టులు మృతి చెందినట్టు సమాచారం. అలాగే ఘటనా స్థలంలో భారీ ఆయుధ సమాగ్రీని భద్రతా బలగాలు స్వాదీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం ఆ ప్రాంతంలో మావోయిస్టుల కోసం ఇంకా సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుందని తెలుస్తోంది. అయితే అధికారులు మాత్రం ఈ ఎన్కౌంటర్ గురించి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు