తిరువనంతపురం11 మార్చి (హి.స.)
: శబరిమల అయ్యప్ప ఆలయంలోని సన్నిధానంలో 18 పవిత్ర మెట్లను అధిరోహించిన వెంటనే భక్తులు నేరుగా స్వామి దర్శనం అయ్యేలా మార్పులు చేయాలని ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు (టీడీబీ) నిర్ణయించింది. ఈ మార్పును ఈ నెల 15 నుంచి 12 రోజుల పాటు విష్ణు పూజ జరిగే రోజుల్లో ప్రయోగాత్మకంగా అమలు చేస్తామని టీడీబీ అధ్యక్షుడు పి.ఎస్.ప్రశాంత్ వెల్లడించారు. ఇది విజయవంతమైతే తదుపరి మండల మకరవిళక్కు సీజన్లోనూ దీన్ని కొనసాగిస్తామని తెలిపారు. మెట్లను ఎక్కిన వెంటనే ప్రస్తుతం భక్తులను ఒక వంతెన మీదికి మళ్లిస్తున్నామని అక్కడ వారు కొంత సమయం క్యూలో వేచి ఉండి అనంతరం స్వామి దర్శనం కోసం మరోవైపునకు వెళ్తున్నారని ప్రశాంత్ చెప్పారు. ఈ పద్ధతిలో భక్తులకు కేవలం ఐదు సెకన్ల వరకే దర్శనభాగ్యం దక్కుతోందన్నారు. భక్తులు మెట్లు ఎక్కిన వెంటనే దర్శనం చేసుకునేలా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. కొత్త మార్పు కారణంగా ప్రతి భక్తునికి 20 నుంచి 25 సెకన్ల పాటు దర్శనం చేసుకునే వీలు కలుగుతుందన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల