దిల్లీ,, 13 మార్చి (హి.స.): రైల్వేల్లోని వివిధ కార్యకలాపాలను ప్రైవేటీకరించడం ద్వారా కేంద్ర ప్రభుత్వం ప్రయాణికుల భద్రత విషయంలో రాజీపడిందని ప్రతిపక్ష పార్టీల నేతలు విమర్శించారు. ప్రమాదాల సంఖ్య అధికమై చాలా మంది ప్రయాణికులు ప్రాణాలుకోల్పోయారని ధ్వజమెత్తారు. రైల్వే శాఖ పనితీరుపై బుధవారం రాజ్యసభలో చర్చ జరిగింది. డీఎంకే ఎంపీ ఎన్.ఆర్.ఇలాంగో మాట్లాడుతూ... ఔట్సోర్సింగ్, కాంట్రాక్టు విధానం వల్ల రైల్వేల్లో 20 లక్షల ఉద్యోగాలు కోతకు గురయ్యాయని తెలిపారు. రైలు మార్గాల నిర్వహణలో బాధ్యత కొరవడిందని పేర్కొన్నారు. గత మూడు నాలుగేళ్లలో 400 మంది రైలు ప్రయాణికులు మృతి చెందారని చెబుతూ... 2018-2021 మధ్య తక్కువగా ఉన్న ప్రమాదాలు ఆ తర్వాత ఎందుకు పెరిగాయని ప్రశ్నించారు. భద్రతా వ్యవస్థ ‘కవచ్’ను పూర్తి స్థాయిలో అమలు చేయకపోవడం అధిక ప్రమాదాలకు ఒక కారణమని సంజయ్ యాదవ్ (ఆర్జేడీ) పేర్కొన్నారు
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు