హైదరాబాద్, 14 మార్చి (హి.స.)
ఢిల్లీ కేంద్రంగా బీజేపీ పై కాంగ్రెస్ పార్టీ కుట్రలకు తెర లేపిందని బీజేపీ సీనియర్ నేత, రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆయన హైదరాబాద్లో మీడియాతో మాట్లాడుతూ.. దక్షిణాది లో బీజేపీ శరవేగంగా బలపడుతోందని.. అందుకే డీలిమిటేషన్ పేరుతో తమిళనాడులో అధికారంలో ఉన్న డీఎంకే దేశ వ్యాప్తంగా దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. నియోజకవర్గాల పునర్విభజనతో ఎలాంటి నష్టం ఉండదని.. ఎందుకు ఇంత రాద్ధాంతం చేస్తున్నారో వారికే తెలియాలని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అయినా
2026 తరువాతే డీలిమిటేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుందని తెలిపారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలు అమలు చేయలేక రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కార్ ఆపసోపాలు పడుతోందని.. సంవత్సరం కాలంలోనే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని కామెంట్ చేశారు. రాష్ట్రంలో పరిణామాలను ప్రజలు గమనిస్తూనే ఉన్నారని.. తెలంగాణలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనని అన్నారు. డీలిమిటేషన్ అంశంపై అఖిలపక్ష సమావేశం ఎందుకని.. ఆరు గ్యారంటీలపై ముందుగా మీటింగ్ పెట్టాల్సిందేని ఎంపీ లక్ష్మణ్ డిమాండ్ చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..