ఫ్లోరిడా, 19 మార్చి (హి.స.)
నాసా వ్యోమగామి, భారత సంతతికి చెందిన సునీతా విలియమ్స్ , ఆమె సహచర వ్యోమగామి బుచ్ విల్మోర్ మొత్తానికి భూమిని చేరారు.
నాసా క్రూ డ్రాగన్ స్పేస్ ఫ్లైట్ వారిని సురక్షితంగా భూమికి తీసుకొచ్చింది. వారితోపాటూ.. మరో ఇద్దరు వ్యోమగాములు కూడా తిరిగి భూమికి వచ్చారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS) నుంచి బయల్దేరిన క్రూ డ్రాగన్ స్పేస్ ఫ్లైట్.. ఈ రోజు బుధవారం తెల్లవారుజామున 3:27కి ఫ్లోరిడా సముద్ర తీరానికి దగ్గర్లోని సముద్ర జలాల్లో దిగింది. ఇలా 9 నెలల నిరీక్షణ తర్వాత.. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ నుంచి సునీతా విలియమ్స్ భూమిని చేరుకోవడంతో.. భారతీయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
రిటర్న్ జర్నీ సాగిందిలా:
ఇదివరకు కొలంబియా స్పేస్ షటిల్.. ఇలాగే క్రూతో భూమిని చేరుతున్నప్పుడు.. ప్రమాదం జరిగి.. ఏడుగురు వ్యోమగాములు ప్రాణాలు కోల్పోయారు. అప్పట్లో స్పేస్ షటిల్.. షీల్డ్ కాలిపోవడంతో.. మంటలు చెలరేగి.. ఆ ఘోర ప్రమాదం సంభవించింది. ఇప్పుడు కూడా.. డ్రాగన్ క్యాప్సుల్.. గంటకు 17 వేల మైళ్ల (27358 కి.మీ) వేగంతో భూమివైపు పయనించింది. ఇలాంటి వేగంతో వస్తున్నప్పుడు.. వాతావరణంలో విపరీతమైన రాపిడి ఉంటుంది. దాన్ని తట్టుకొని క్యాప్సుల్ భూమికి వచ్చింది. ఐతే.. ఆ వేగంతో సముద్ర జలాల్లో దిగితే.. సముద్రం లోపలికి దూసుకుపోయే ప్రమాదం ఉంటుంది. అందువల్ల భూమికి దగ్గరయ్యే కొద్దీ.. క్రమంగా వేగాన్ని తగ్గిస్తూ వచ్చారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి