హైదరాబాద్, 31 మార్చి (హి.స.)ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ (MK Stalin) ఆదివారం తన సామాజిక మాధ్యమ ఖాతాలో పోస్ట్ చేశారు. తెలుగు, కన్నడ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. అయితే, అందులో కన్నడిగులను ఆయన ద్రవిడులుగా పేర్కొనడం వివాదానికి దారితీసింది. స్టాలిన్ పోస్ట్పై పలువురు కన్నడవాసులు (Kannadigas) ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
‘‘నూతన సంవత్సరాదికి కొత్త ఆశలతో స్వాగతం పలుకుతున్న తెలుగు, కన్నడ మాట్లాడే ద్రవిడ సోదరులు, సోదరీమణులకు ఉగాది (Ugadi) శుభాకాంక్షలు. హిందీ భాష బలవంతపు అమలు, డీలిమిటేషన్ వంటి భాషా, రాజకీయ ముప్పుల నేపథ్యంలో ప్రస్తుతం దక్షిణాది ఐకమత్యంతో ఉండటం అత్యవసరం. మన హక్కులు, గుర్తింపును అణగదొక్కే ప్రతి ప్రయత్నాన్ని మనమంతా కలిసి ఓడించాలి. ఈ ఉగాది మన ఐక్యతకు స్ఫూర్తిగా నిలవాలి’’ అని స్టాలిన్ నిన్న పోస్ట్ పెట్టారు. అందరికీ ఉగాది శుభాకాంక్షలు అంటూ తెలుగు, కన్నడలో రాశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు