అమరావతి, 1 జూలై (హి.స.)
అమరావతి: గిరిజన గురుకులాల్లో ఔట్సోర్సింగ్ బోధనా సిబ్బంది వేతనాలను పెంచుతూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మొత్తం 1659 మంది వేతనాలను పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. కేటగిరీ ఏలోని రెసిడెన్షియల్ స్కూళ్లు, కళాశాలల్లో పనిచేస్తున్న సిబ్బందికి వేతనాలను పెంచింది. జూనియర్ లెక్చరర్లు, పీడీ(సి), లైబ్రేరియన్లు, పీజీటీల వేతనాన్ని రూ.24,150, టీజీటీ పీడీ(ఎస్) వేతనాలు రూ.19,350, పీఈటీ, ఆర్ట్, క్రాఫ్ట్ మ్యూజిక్ సిబ్బంది వేతనం రూ.16,300కి పెంచింది.
కేటగిరీ బీలోని స్కూళ్లు, కాలేజ్ ఆఫ్ ఎక్స్లెన్స్లో 40 మంది జూనియర్ లెక్చరర్లు, 18 మంది పీజీటీల వేతనాలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో పీజీటీల వేతనాలు రూ. 25వేల నుంచి రూ.31,250కి పెరిగాయి. అరకు వ్యాలీ బాలుర స్పోర్ట్స్ స్కూల్లో కోచ్ వేతనాన్ని రూ. 25వేల నుంచి రూ. 31,250కి పెంచింది. అసిస్టెంట్ కోచ్ వేతనాలు రూ.22వేల నుంచి రూ.27,500కు పెంచుతూ గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ