విశాఖపట్నం, 17 సెప్టెంబర్ (హి.స.) ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు విశాఖపట్టణంలో పర్యటించనున్నారు. ఆయన ఉదయం 12:35 గంటలకు విశాఖపట్నం చేరుకుంటారు. అనంతరం మహిళా ఆరోగ్య పరిరక్షణకు సంబంధించిన 'స్వస్థ్ నారీ - సశక్త్ పరివార్ అభియాన్' పేరుతో నిర్వహించే పలు కార్యక్రమాలలో ముఖ్యమంత్రి పాల్గొంటారు.
ఆంధ్ర విశ్వవిద్యాలయంలోని సాగరికా ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన హెల్త్ క్యాంపులను ముఖ్యమంత్రి సందర్శిస్తారు. ఆ తరువాత మధ్యాహ్నం 1 గంటలకు ఆంధ్ర విశ్వవిద్యాలయం కన్వెన్షన్ సెంటర్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్గా ప్రారంభించనున్న 'స్వస్థ్ నారీ - సశక్త్ పరివార్ అభియాన్' సభలో ముఖ్యమంత్రి పాల్గొని ప్రసంగిస్తారు.
అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు రాడిసన్ బ్లూ హోటల్లో గ్లోబల్ కేపబులిటీ సెంటర్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న బిజినెస్ సమ్మిట్లో ముఖ్యమంత్రి పాల్గొంటారు. అక్కడే నెదర్లాండ్స్, ఫ్రెంచ్ దేశాలకు చెందిన ప్రతినిధుల బృందంతో చంద్రబాబు నాయుడు విడివిడిగా సమావేశమవుతారు. రాత్రి 8:40 గంటలకు విశాఖపట్నం పర్యటన ముగించుకుని ముఖ్యమంత్రి అమరావతికి బయలుదేరతారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి