
బెంగళూరు, 20 జనవరి (హి.స.) ఎముకల బలం మన ఆరోగ్యానికి చాలా కీలకం, ఎందుకంటే అవి శరీరానికి ఆకారాన్ని ఇవ్వడమే కాకుండా, అంతర్గత అవయవాలను రక్షిస్తాయి, కదలికకు తోడ్పడతాయి. ముఖ్యంగా, కాల్షియం వంటి ఖనిజాలను నిల్వ చేస్తాయి. బోలు ఎముకల వ్యాధి (Osteoporosis) వంటి సమస్యలను నివారించడానికి, శరీరానికి కాల్షియం, విటమిన్ డి, ప్రోటీన్లు పుష్కలంగా ఉన్న ఆహారం తీసుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం అవసరం.ఎముకలు శరీర నిర్మాణానికి ఊతమిస్తూ కీలక అవయవాలను కాపాడుతూ ఆరోగ్యం, శరీర వృద్ధికి అవసరమైన క్యాల్షియంను స్టోర్ చేస్తాయి. ఎముకల బలానికి మెరుగైన ఆహారం, ఆరోగ్యకర జీవనశైలిని అలవరుచుకోవాలని ఆయుర్వేద ఆరోగ్య నిపుణులు బెంగళూరుకు చెందిన డా.పుల్లా రావు .సి సూచిస్తున్నారు.
చలి కాలంలో ఎముకలు, కీళ్ళు నొప్పులు తీవ్రంగా ఉంటాయి. ముఖ్యంగా అరవై ఏళ్లు పైబడిన వారిలో ఈ లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి. అయితే ప్రస్తుత కాలంలో యువత కూడా కీళ్ల నొప్పులతో ఇబ్బంది పడుతున్నారు. దీనికి అతిపెద్ద కారణం కాల్షియం లోపం. అందుకు కారణం ప్రోటీన్ కు ఇచ్చిన ప్రాముఖ్యత కాల్షియంకు ఇవ్వకపోవడమే. నేటి జీవనశైలి కారణంగా ఉదయం ఎండలో నడిచేవారే కరువయ్యారు. దీంతో శరీరంలో విటమిన్ డి లోపం తలెత్తుతుంది.
100 గ్రాముల నువ్వులలో దాదాపు 975 మిల్లీ గ్రాముల కాల్షియం లభిస్తుంది. నువ్వుల లడ్డులు, చట్నీలు, సలాడ్లలో కలిపి తినవచ్చు. శీతాకాలంలో క్రమం తప్పకుండా వీటిని తీసుకోవడం వల్ల ఎముకలు బలపడతాయి. అలాగే శీతాకాలంలో లభించే ఆకుకూరల్లో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. పాలకూరలో కాల్షియం, విటమిన్ కె అధికంగా ఉంటాయి. ఇవి ఎముకలను బలపరుస్తాయి. వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల కీళ్ల నొప్పులు కూడా తగ్గుతాయి. కిడ్నీ బీన్స్, చిక్పీస్లో కూడా కాల్షియం అధికంగా ఉంటుందని చాలా మందికి తెలియదు. ఒక కప్పు ఉడికించిన శనగల్లో 80 నుండి 100 మిల్లీ గ్రాముల కాల్షియం ఉంటుంది.
. చల్లని వాతావరణంలో రోజూ 5 నుంచి 7 బాదం పలుకులు నానబెట్టి తినడం వల్ల చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. రాగుల్లో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. 100 గ్రాముల రాగులు.. మూడు గ్లాసుల పాలలో ఉన్నంత శక్తిని కలిగి ఉంటాయి. ఎందుకంటే కేవలం 100 గ్రాముల రాగులతో శరీరానికి సుమారు 350 మిల్లీ గ్రాముల కాల్షియం అందుతుంది. పిల్లలు నుంచి మహిళలు, సీనియర్ సిటిజన్లు.. ఇలా అందరికీ రాగులతో ప్రయోజనాలు ఉన్నాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV