
హైదరాబాద్, 23 ఫిబ్రవరి (హి.స.)
చలికాలం పోయి ఎండాకాలం వస్తున్న
క్రమంలో తెలంగాణ రాష్ట్రంలో అకాల వర్షాలు రైతులను ఇబ్బంది పెడుతున్నాయి. ఈ క్రమంలోనే రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రెండు రోజులు నుంచి అకస్మాత్తుగా వాతావరణం మారిపోయి ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో మోస్తరు వర్షాలతో పాటు ఉరుములు, మెరుపులతో కూడిన తుపాన్లు సంభవించే అవకాశం ఉన్నట్లు వేదర్ మ్యాన్ అలర్ట్ జారీ చేశారు. ముఖ్యంగా కొన్ని ప్రాంతాల్లో వడగళ్ల వానలు (Hailstorms) కురిసే అవకాశం ఉన్నందున రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఈ రోజు మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు జోన్ 1లో ఉన్న మెదక్, సిద్దిపేట, కామారెడ్డి, వికారాబాద్, యాదాద్రి భువనగిరి, సంగారెడ్డి, నిజామాబాద్, సిరిసిల్ల, జగిత్యాల, మంచిర్యాల, కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో చెదురుమదురుగా మోస్తరు వర్షాలు, పిడుగులు పడే అవకాశం ఉన్నట్లు తెలిపారు. అలాగే రాత్రి నుండి ఉదయం వరకు జోన్ 2లో రంగారెడ్డి, నల్గొండ, యాదాద్రి భువనగిరి, మహబూబ్ నగర్, సూర్యాపేట, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, మెదక్, సిద్దిపేట జిల్లాలో మోస్తరు వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి.
హైదరాబాద్ నగరానికి సంబంధించి సాయంత్రం నుంచి రాత్రి సమయంలో మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని తెలంగాణ వెదర్ మ్యాన్ అంచనా వేశారు. నగరవాసులు తమ ప్రయాణాలను వాతావరణ పరిస్థితికి అనుగుణంగా ప్లాన్ చేసుకోవాలని సూచించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు