
హైదరాబాద్, 28 ఫిబ్రవరి (హి.స.)
ఫిబ్రవరి నెలలోనే భానుడు ప్రతాపం చూపుతున్నాడు. మార్చి నెల ప్రారంభం కాకముందే ఎండలు మండిపోతున్నాయి. దీంతో రాష్ట్రంలో ఒక్కసారిగా విద్యుత్ వినియోగం గణనీయంగా పెరిగింది. ఈ క్రమంలో తెలంగాణ ఉత్తర విద్యుత్ పంపిణీ సంస్థ (టీజీ ఎన్పీడీసీఎల్) పరిధిలో విద్యుత్ వినియోగం సరికొత్త గరిష్ట స్థాయిని తాకింది. ఈ ఒక్కరోజే గరిష్టంగా 6,057 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ నమోదైందని సంస్థ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి వెల్లడించారు. గత ఏడాది మార్చి 11న నమోదైన 5,816 మెగావాట్ల అత్యధిక డిమాండ్ రికార్డును ఈ ఏడాది ఫిబ్రవరిలోనే దాటేయడం గమనార్హం అన్నారు.
ముందస్తు ప్రణాళికలు:
నిరంతర విద్యుత్ సరఫరాను అందించేందుకు ముందస్తు ప్రణాళికలతో చేపట్టిన చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయని ఆయన వివరించారు. 35 కొత్త 33/11 కేవీ సబ్స్టేషన్ల ఛార్జ్ చేశామని, 366 అదనపు పవర్ ట్రాన్స్ ఫార్మర్ల ఏర్పాటు చేశామని, 7600 ట్రాన్స్ఫార్మర్ల సామర్థ్య పెంపు చేపట్టామని, ఓవర్లోడ్ ఉన్న 33 కేవీ 8 ఫీడర్ల ను విభజన చేశామని, 1200 కిలో మీటర్ల మేర 33 కేవీ ప్రత్యామ్నాయ (ఆల్టర్నేట్) లైన్ల ఏర్పాటు చేశామని ఆయన వివరించారు. లో వోల్టేజి తగ్గించడానికి 392 కెపాసిటర్ బ్యాంకులు పెట్టామని చెప్పారు. వేసవి కాలంలో మరింత పెరగనున్న డిమాండ్కు అనుగుణంగా నాణ్యమైన విద్యుత్తును సరఫరా చేసేందుకు ఎన్పీడీసీఎల్ యంత్రాంగం పూర్తి సన్నద్ధతతో ఉందని సీఎండీ స్పష్టం చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు