
హైదరాబాద్, 04 ఫిబ్రవరి (హి.స.)
మెట్రో నగర ప్రజలకు గుడ్న్యూస్ చెప్పింది. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మెట్రో ఫేజ్ 2పై అప్డెట్ ఇచ్చింది. హైదరాబాద్ మెట్రో ఫేజ్–2 ప్రాజెక్ట్తో నగరంలో ప్రయాణం మరింత సులభం, వేగంగా మారనుంది. రోజూ ట్రాఫిక్తో ఇబ్బంది పడే లక్షల మందికి ఇక ఊరట లభించనుంది. ఫేజ్ 2 సంబంధించి తాజాగా హైదరాబాద్ మెట్రో ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రకటన ప్రకారం.. ఫేజ్ 2లో మొత్తం 76.4 కిలోమీటర్ల మేర కొత్త మెట్రో మార్గాలు ఏర్పడనున్నాయి. దీనికి తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే పరిపాలనా అనుమతి ఇచ్చింది. ప్రాజెక్ట్ వివరాల నివేదికను కేంద్ర ప్రభుత్వానికి పంపించారు. భూసేకరణ కోసం 2026 జనవరిలోనే రాష్ట్ర మంత్రివర్గం భారీగా నిధులు మంజూరు చేసింది. అంటే ఈ ప్రాజెక్ట్ వేగంగా పూర్తవ్వనుంది. ఈ రెండో దశలో ఐదు కొత్త కారిడార్లు రాబోతున్నాయి. నాగోల్ నుంచి శంషాబాద్ విమానాశ్రయం వరకు మెట్రో రైలు పరుగులు తీయనుంది. ఎయిర్పోర్ట్కు వెళ్లే ప్రయాణికులు రోడ్డు ట్రాఫిక్ భయం లేకుండా నేరుగా మెట్రోలో విమానాశ్రయానికి చేరుకోవచ్చు. ఎక్కువ భాగం ఎలివేటెడ్ మార్గంగానే ఉండగా, కొంత భాగం భూగర్భంగా ఉంటుంది.
రాయదుర్గం నుంచి కొకాపేట్ నియోపోలిస్ వరకు మరో మార్గం రానుంది. ఇది ఐటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ప్రాంతాలకు పెద్ద ప్లస్ అవుతుంది. ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులకు రోజూ ట్రావెల్ టైం బాగా తగ్గుతుంది. ఎంజీబీఎస్ నుంచి చంద్రాయణగుట్ట వరకు మెట్రో విస్తరణతో పాతబస్తీ ప్రాంతాలకు సైతం మెరుగైన కనెక్టివిటీ వస్తుంది. మియాపూర్ నుంచి పటాన్చెరు వరకు, ఎల్బీ నగర్ నుంచి హయత్నగర్ వరకు మెట్రో పొడిగింపులు జరగనున్నాయి. జాతీయ రహదారుల వెంట ఈ మార్గాలు ఉండటం వల్ల వాహనాల రద్దీ తగ్గుతుంది. నగరానికి అంచున ఉన్న ప్రాంతాలు సైతం మెట్రోతో ఏకం కానున్నాయి. దీంతో ఉద్యోగాలు, వ్యాపారాలు, అభివృద్ధి అక్కడికీ విస్తరిస్తాయి. ఈ ఫేజ్ 2 మెట్రో వల్ల కేవలం ప్రయాణమే కాదు, నగర జీవన విధానం కూడా మారుతుంది. రోడ్లపై వాహనాలు తగ్గడంతో కాలుష్యం తగ్గుతుంది. ఇంధన ఖర్చు తగ్గుతుంది. సమయం ఆదా అవుతుంది. కొత్త ప్రాంతాలకు కనెక్టివిటీ పెరగడంతో పెట్టుబడులు, ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్