సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు.. సినిమా నిర్మాతలకు ఊరట
సినిమా టికెట్ ధరల పెంపు అంశంలో 90 రోజుల నిబంధనపై సుప్రీంకోర్టు స్టే విధించింది. దీంతో సినిమా నిర్మాతలకు భారీ ఊరట లభించినట్లయ్యింది. సినిమా టికెట్ రేట్లు పెంచాలంటే విడుదలకు 90 రోజుల ముందే ప్రభుత్వం జీవో జారీ చేయాలంటూ.
Supreme court


డిల్లీ, 13 మార్చి (హి.స.)సినిమా టికెట్ ధరల పెంపు అంశంలో 90 రోజుల నిబంధనపై సుప్రీంకోర్టు స్టే విధించింది. దీంతో సినిమా నిర్మాతలకు భారీ ఊరట లభించినట్లయ్యింది. సినిమా టికెట్ రేట్లు పెంచాలంటే విడుదలకు 90 రోజుల ముందే ప్రభుత్వం జీవో జారీ చేయాలంటూ గతంలో తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేశారు మైత్రి మూవీ మేకర్స్. వీరి పిటిషన్ను శుక్రవారం నాడు విచారించిన జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ చందూర్కర్ ధర్మాసనం.. తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై స్టే విధించింది. టికెట్ ధరల పెంపుపై గత విధానాన్నే కొనసాగించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.

సినిమా టికెట్ల రేట్ల పెంపునకు సంబంధించి తెలుగు రాష్ట్రాల్లో గత కొన్నేళ్లుగా వివాదాలు నడుస్తున్నాయి. ఈ ఏడాది సంక్రాంతి పండుగ సమయంలో విడుదలైన తెలుగు సినిమాల టికెట్ ధరలు పెంచేందుకు అనుమతి ఇస్తూ తెలంగాణ రాష్ట్ర హోంశాఖ ముఖ్యకార్యదర్శి మెమో జారీ చేశారు. దీనిని వ్యతిరేకిస్తూ కొందరు హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్లు విచారించిన ధర్మాసనం.. ప్రభుత్వం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. భవిష్యత్లో టికెట్ ధరలు పెంచొద్దంటూ గతంలో ఇచ్చిన ఆశాలను ఉటంకిస్తూ ప్రభుత్వ తీరును నిలదీసింది హైకోర్టు ధర్మాసనం. పబ్లిక్ డొమైన్లో ధరల పెంపు మెమోను పెట్టడాన్ని సుమోటో కోర్టు ధిక్కరణగా పరిగణనలోకి తీసుకున్నట్లు ప్రకటించింది. ఇకపై టికెట్ ధరలు పెంచాలని భావిస్తే సినిమా విడుదలకు 90 రోజుల ముందే వెల్లడించాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది హైకోర్టు. అయితే, మైత్రీ మూవీ మేకర్స్ తెలంగాణ హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ క్రమంలో హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీంకోర్టు ధర్మాసనం స్టే విధించింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్


 rajesh pande